Palamuru-Rangareddy Lift Irrigation | ఓ వైపు కాకతీయుల స్ఫూర్తి.. మరోవైపు ముంపు తగ్గించాలనే ఆర్తి.. ఇంకోవైపు జలాశయం సుదీర్ఘకాలం నిలువాలనే దూరదృష్టి.. ఇదీ భారీ జలాశయాల నిర్మాణంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న విధానం. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు దర్పణం. గుట్టలే ఆనకట్టలుగా.. కొండలను కలుపుతూ కిలోమీటర్ల మేర చేసిన నిర్మాణమే సీఎం కేసీఆర్ విజన్కు ప్రతిబింబం. కాళేశ్వరమే కాదు.. ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి పథకంలోని ప్రతి జలాశయమూ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. కురుమూర్తిరాయ రిజర్వాయర్లో జలాశయ ఆనకట్టలైన ఐదు కొండలే కేసీఆర్ రీఇంజినీరింగ్కు చెక్కుచెదరని నిలువెత్తు సాక్ష్యం. సాగు, తాగునీటిని అందించడమే కాదు.. భావి తెలంగాణలో గొప్ప పర్యాటక క్షేత్రాలుగా వర్ధిల్లుతూ తెలంగాణ పేరును చరిత్రలో నిలబెట్టే అతి గొప్ప కట్టడం.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాకతీయులు కొండల మధ్యలోని లోతట్టు ప్రాంతాల్లో చెరువులను నిర్మించారు. దీంతో గుట్టలు సహజ గట్లలా ఏర్పడి జలాశయపు ఖర్చును తగ్గించడమేగాకుండా.. చిరకాలం పాడవకుండా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. కొండలపై పడ్డ నీరు జలాశయంలోకి చేరి నీటి మట్టాన్ని కాపాడేందుకు అనువుగా ఉంటుంది. చుట్టుపక్కల నుంచి వాలుగా నీరు వచ్చి పల్లంగా ఉన్న జలాశయంలో జలజలావచ్చి చేరి వర్షపు నీరు వృథా కాకుండా ఉండేది. ఈ నేపథ్యంలోనే రెండు/మూడు ఒక్కోసారి నాలుగు గుట్టలను కులపుతూ రాతికట్టుతో జలాశయాలను నిర్మించారు. అందుకు పాకాల, రామప్ప, లక్నవరం, ధర్మసాగర్, గణపసముద్రం ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణవ్యాప్తంగా ఎన్నో చెరువులు ఉదాహరణగా నిలుస్తాయి. అంతేకాదు చెరువులకు అటు, ఇటు పర్వతాలు ఎంత దూరంలో ఉండాలి? పరివాహక ప్రదేశ విస్తీర్ణం ఎంత ఉండాలి? చెరువు గర్భం ఎలా ఉండాలి? అడ్డుకట్టు ఏ విధంగా కట్టాలి? చెరువు ఆయకట్టు భూములు ఏ రకంగా ఉండాలి? పొలాలకు ఎలా నీటిని వదలాలి? తదితర అంశాలన్నింటిపైనా కాకతీయులు జలసూత్రాలను రూపొందించారు. తమ శాసనాల్లో వాటిని పొందుపరిచారు. ఆ కాకతీయులు చూపిన మార్గంలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుతున్నది. భారీ జలాశయాల నిర్మాణంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ స్ఫూర్తిని చాటుతున్నారు. తక్కువ ఖర్చుతో, అతితక్కువ ముంపుతో రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన రిజర్వాయర్లే కాకుండా ప్రస్తుతం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రాజెక్టులోని 5 రిజర్వాయర్లు సీఎం కేసీఆర్ దార్శనికతకు అద్దం పడుతున్నాయి.
గతంలో ప్రాజెక్టు ప్రతిపాదించిన రీతిలో రిజర్వాయర్లను నిర్మిస్తే మొత్తంగా 47 గ్రామాలు, 16,342 ఆవాసాలు, 84,400 జనాభా ముంపునకు గురయ్యేవి. వేలాది ఎకరాల సాగుభూములు కూడా మునిగిపోయేవి. సీఎం కేసీఆర్ విజన్తో గుట్టల నడుమ, గుట్టలను కలుపుతూ కట్టలను నిర్మించి, రిజర్వాయర్లను తీర్చిదిద్దారు. మొత్తంగా ముంపును 23 గ్రామాలకు, 2,481 ఆవాసాలకు, 11,025 జనాభాకు గణనీయంగా కుదించారు.
అతితక్కువ ముంపుతో భారీ రిజర్వాయర్లు
ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ నలుమూలలపై అపారమైన అవగాహన ఉన్నది. ఉద్యమకాలంలో స్వయంగా ఊరూరా తిరిగారు. ఎక్కడ ఏ గుట్టలు ఉన్నాయి? సారవంతమైన భూములున్నాయి? వాగులున్నాయి? లాంటి అంశాలన్నింటినీ ఔపోసన పట్టారు. ఆ అనుభవం నేడు రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టుల రూపంలో ప్రతిఫలిస్తున్నది. మరీ ముఖ్యంగా రిజర్వాయర్ల నిర్మాణంలో అది స్పష్టంగా తెలిసిపోతున్నది. కేసీఆర్ విజన్తో రూపుదిద్దుకొన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కొమురవెల్లి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు కాకతీయుల స్ఫూర్తిని చాటుతున్నాయి. ఇప్పుడు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో నిర్మించిన ఐదు రిజర్వాయర్లు కూడా అదే తరహాలో ఉండటం విశేషం. కేసీఆర్ ఓ ఇంజినీర్లా మారి ప్రాజెక్టును ఎక్కడ నిర్మించాలి? ఎలా నిర్మించాలి?లాంటి అంశాలన్నింటినీ స్వయం గా రూపొందించడమేగాకుండా, పూర్తిస్థాయి లో లోతైన పరిశీలన జరిపి, ఇంజినీరింగ్ అధి కారులతో అన్ని కోణాల్లో చర్చించి, క్షేత్ర స్థాయి లో భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి సీఎం కేసీఆర్ ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేశారు.
జంట జలాశయాలు.. ఎన్నో ప్రత్యేకతలు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్మించిన పలు జలాశయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో మొత్తంగా రెండు జంట జలాశయాలున్నాయి. ఇప్పటికే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా 0.25 టీఎంసీతో 345 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఎల్లూరు రిజర్వాయర్ను ఆనుకొనే దానికి సమాంతరంగా అదే లెవల్లో నార్లాపూర్ వద్ద పాలమూరు ప్రాజెక్టులో భాగంగా అంజనగిరి రిజర్వాయర్ను నిర్మించారు.ఆ రెండు రిజర్వాయర్లను అనుసంధానించారు. 345 లెవల్ వల్ల రెండు రిజర్వాయర్లలో ఒకే స్థాయిలో జలాలు ఉండనున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కల్వకుర్తి లిఫ్ట్లతో పనిలేకుండానే ఎల్లూరు రిజర్వాయర్ను నింపే వెసులుబాటు కలుగనున్నది. అదేవిధంగా వెంకటాద్రి, కురుమూర్తిరాయ రిజర్వాయర్లను కూడా ఒకరకంగా జంట జలాశయాలుగా పిలుస్తారు. ప్రాజెక్టు మొత్తంలో సొరంగమార్గం లేకుండా 9.75 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ఉన్నది ఈ రెండు రిజర్వాయర్ల మధ్యనే కావడం విశేషం. ఇక కురుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లకు మరో ప్రత్యేకత ఉన్నది. ప్రాజెక్టు మొత్తంలో ఈ రెండు రిజర్వాయర్ల మధ్య నీరు బయటకు కనిపించకుండా పూర్తిగా 8.9 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన సొరంగమార్గం గుండా ప్రవహించనుండటం మరో విశేషం. ఇక రిజర్వాయర్ల మధ్య కూడా అనేక ఐలాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీరాంజనేయ రిజర్వాయర్ మధ్యలో రంగనాయకసాగర్ తరహాలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటం మరో విశేషం.
పేర్లలో ఆధ్యాత్మిక ‘జల’సౌరభం
ప్రాజెక్టుల నిర్మాణమే కాదు వాటికి పేర్లు పెట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తారు. స్థానికంగా ఉండే ఇలవేల్పుల పేర్లను అక్కడి నిర్మాణాలకు పెడుతూ భక్తిని, ప్రాజెక్టులపై అనురక్తిని చాటుకొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, శ్రీరాజరాజేశ్వర జలాశయాల పేర్లే అందుకు నిదర్శనం. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రిజర్వాయర్లకు పేర్లు పెట్టడంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ అదే సంప్రదాయాన్ని చాటడం విశేషం. జలాశయాలన్నింటికీ స్థానిక దైవాల పేరునే పెట్టారు. నార్లాపూర్ సమీప గుట్టపైకొలువైన అంజనేయుడి పేరు మీదుగా నార్లాపూర్ రిజర్వాయర్కు అంజనగిరిగా, ఏదులలో నిర్మించిన జలాశయానికి సమీప ఎర్రగట్టు ఆంజనేయస్వామి పేరుమీదుగా వీరాంజనేయ రిజర్వాయర్గా, వట్టెంలోని వేంకటేశ్వరస్వామి పేరు మీదుగా వట్టెం రిజర్వాయర్కు వెంకటాద్రి రిజర్వాయర్గా, కరివెన రిజర్వాయర్కు సమీపంలోని కురుమూర్తిరాయ దైవం పేరును ఖరారు చేశారు.