హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): లోపభూయిష్టంగా ఉన్న పీహెచ్డీ ప్రవేశాలను గాడిలోపెట్టేందుకు ఇకపై రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సోమవారం ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల వీసీలతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. విధివిధానాల ఖరారుకు మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ విద్యాసంవత్సరం లేదా వచ్చే విద్యాసంవత్సరం నుంచి కామన్ పీహెచ్డీ సెట్ను నిర్వహించి ప్రవేశాలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఓయూకు అ ప్పగించాలని యోచిస్తున్నారు. హెచ్సీయూ తరహాలో అందరికీ ప్రవేశ పరీక్షను నిర్వహించాలా, లేక ఉస్మానియా తరహాలో మినహాయింపులివ్వాలా అన్న అం శాలను పరిశీలించి తది మార్గదర్శకాలను ఖరారు చేయనున్నట్టు తెలుస్తున్నది.
పీజీ కాలేజీల్లో కామన్ విద్యా క్యాలెండర్
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మాదిరిగా పీజీ (ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ) కాలేజీల్లో కామన్ విద్యా క్యాలెండర్ను అమలు చేయాలని అధికారులు నిర్ణయించా రు. వీసీల సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లిం బాద్రి వెల్లడించారు. ఇది ఈ నెల 20 నుంచి అమలయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ 6 యూనివర్సిటీల పరిధిలోని అన్ని పీజీ కాలేజీల్లో ఒకేసారి తరగతులు ప్రారంభమవుతాయి. సెమిస్టర్ల వారీ పరీక్షలను ఏకకాలంలో నిర్వహిస్తారు. ఫలితాలను కూడా క్యాలెండర్లో పేర్కొన్న తేదీల్లోనే ప్రకటించే అవకాశాలుంటాయి. అయితే జేఎన్టీయూ హైదరాబాద్, జెఎన్యూ ఫైన్ఆర్ట్స్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లాంటి ప్రత్యేక విశ్వవిద్యాలయాల్లో మాత్రం కామన్ విద్యా క్యాలండర్ను అమలు చేయడం సాధ్యంకాదని అధికారులు స్పష్టం చేశారు.