చండూరు : మునుగోడు నియోజకవర్గం చండూరు మున్సిపాలిటీ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చండూరుకు చెందిన రామస్వామి వెంకటేశ్వర్లు, బొమ్మకంటి ఆంజనేయులు, బిలాల్, జాకీర్, నదీం తదితరులకు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రజల అభిమానం లేని ప్రతిపక్ష పార్టీలతో మేలేమి జరగదన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి యువత ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అనుభవంతో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. మరోవైపు మంత్రి కేటీఆర్ పార్టీని సమర్ధవంతంగా నడిపిస్తున్నారని ఆయన వెల్లడించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజారిటీతో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.