సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) మండలం అస్లా తండా, మిడతనపల్లి గ్రామాలకు చెందిన సుమారు 132 మంది కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల ను వీడి టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి జిల్లాలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయన్నారు.
ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఇంకా ఆయపార్టీలలో కొనసాగుతున్న నాయకులు సైతం స్వచ్ఛందంగా తరలి రావడం మంచి పరిణామం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తుందన్నారు.
రెండు గ్రామాల నుంచి నేతలు వాంకుడోతు భీమా, కరుణాకర్, హార్య, సామ లక్ష్మారెడ్డి, జ్ఞాన సుందర్, వంటి నేతలతో పాటు వారి అనుచరులు , కుటుంబసభ్యులు పార్టీలో చేరారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, సింగిల్ విండో ఛైర్మెన్ కోకొనతం సత్యనారాయణ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బోలెద్దు జానయ్య తదితరుల పాల్గొన్నారు.