హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణాల్లో ఒకటైన నియామకాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయంలో స్థానికులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తెలంగాణ యువతకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ తెచ్చిన టీఆర్ఎస్ సర్కార్.. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ స్థానిక యువతకే అధిక అవకాశాలు లభించేలా జాగ్రత్తపడుతున్నది. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా లోకల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని అమలు చేస్తున్నది. టీఎస్-ఐపాస్ ద్వారా తెలంగాణకు భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను రాబడుతున్న ప్రభుత్వం.. లోకల్ ఎంప్లాయ్మెంట్ పాలసీతో ఆయా కంపెనీల్లో స్థానికులకు ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకొంటున్నది. యువతకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, స్కిల్, సెమీ స్కిల్ కలిగిన యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ కంపెనీలు వివిధ రకాల రాయితీలను, ప్రత్యేక ప్రోత్సాహకాలను పొందుతున్నాయి. నైపుణ్యాల పెంపునకు గాను ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.3 వేల చొప్పున ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నది. లోకల్ ఎంప్లాయ్మెంట్ విధానంతో ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు స్థానిక యువత ప్రయోజనం పొందుతుండటంపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమవుతున్నది.
విమర్శలకు అవకాశం లేకుండా..
ఐటీ, పరిశ్రమల రంగంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీల నేతలు ఏకీభవిస్తున్నారు. కానీ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాలసీపై అవగాహన లేకపోవడం వల్ల కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ పురోగతిపై ఇటీవల శాసనమండలిలో జరిగిన లఘు చర్చలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో వారికి పూర్తి స్పష్టత వచ్చేలా మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడులను ఆహ్వానిస్తున్న ఈ పోటీ ప్రపంచంలో కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడం వల్ల నష్టపోతామని చెప్పారు. అందుకే లోకల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పాలసీతో ఆయా కంపెనీలతోపాటు స్థానిక యువతకూ ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.