హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్పౌజ్ క్యాటగిరీ కింద జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని టీఎన్జీవోస్ కోరింది. సోమవారం ఈ మేరకు జీఏడీ వీ శేషాద్రికి వినతిపత్రం అందజేసింది. టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ మాట్లాడుతూ పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని, జోన్లవారీగా ఉద్యోగుల సీనియారిటీని గుర్తించాలన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషన్ ద్వారా పదవీ విరమణ పొందిన కుటుంబ సభ్యుల ఉద్యోగాలకు రాష్ట్రస్థాయి కమిటీని నియమించాలని కోరారు. సర్వీసులో ఉద్యోగి చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఉద్యోగం వద్దనుకొంటే.. ఎక్స్గ్రేషియాను పీఆర్సీ కమిషన్ సూచన మేరకు సవరించాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిసి ఏపీలోని 123 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకురావాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో టీఎన్జీవోస్ నగర అధ్యక్షుడు ఎన్ శ్రీరామ్, వివిధ జిల్లాల అధ్యక్షులు శ్రవణ్కుమార్, రవి ప్రకాశ్, పరమేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.