హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహిస్తున్న జాబ్మేళాకు విశేష స్పందన వస్తున్నదని యూనివర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. వర్సిటీ యూఐఐసీ విభాగం, లాస్యా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తాధ్వర్యంలో వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన రెండ్రోజుల జాబ్మేళాను రెక్టార్ ఏ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్తో కలిసి వీసీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వర్సిటీలో నిర్వహించిన జాబ్మేళాలో 268 కంపెనీలు పాల్గొంటున్నాయని, యూజీ, పీజీ, డిప్లొమా, ఇంటర్, ఎస్సెస్సీ అర్హత కలిగిన 20 వేల మంది నిరుద్యోగులకు ఐటీ, ఫార్మా ఇతర రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వివరించారు.
80 వేలకు పైగా నిరుద్యోగ యువత ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. తొలిరోజు 20 వేల మంది యవతీ, యువకులు నేరుగా హాజరయ్యారు. నిరుద్యోగ యువత ఈ జాబ్మేళాను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. వర్సిటీ ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా జాబ్మేళాను నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రతీ శనివారం జాబ్మేళా నిర్వహిస్తామని వెల్లడించారు. యూఐఐసీ డైరెక్టర్ తారాకల్యాణి, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ కో ఆర్డినేటర్ శ్రీదేవి, నిపుణ ఫౌండర్ సుభద్రారాణి, లాస్యా ఇన్ఫోటెక్ హెచ్ఆర్ హర్షారెడ్డి, కార్తీక్ పాల్గొన్నారు.