హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆధార్బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ను పాటించని ఇంజినీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ షాక్ ఇచ్చింది. కనీస హాజరుశాతం నమోదుకాకపోవడంపై సదరు కాలేజీలకు నోటీసులు జారీచేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ముందు హాజరైనవారు బయోమెట్రిక్ హాజరు నమోదుచేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండుసార్లు హాజరు నమోదు తప్పనిసరి అని ఆదేశాలిచ్చారు.
కాగా, ఈ విద్యాసంవత్సరం పలు కాలేజీల్లో కొత్త ఫ్యాకల్టీని తీసుకొన్నారు. ముఖ్యంగా సీఎస్ఈ బ్రాంచిలోనే 5వేలకు పైగా కొత్త వారిని నియమించారు. ఫ్యాకల్టీని నియమించామని కాగితాల రూపంలో చూపిన కాలేజీలు.. అనుబంధ గుర్తింపుకోసం తనిఖీలకు వెళ్లిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల ముందు కూడా ఫ్యాకల్టీని హాజరుపరిచారు. అయితే, సంబంధిత అధ్యాపకులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడం లేదని పరిశీలనలో తేలింది. దీనిపై ఆగ్రహించిన జేఎన్టీయూహెచ్ బయోమెట్రిక్ హాజరును అమలుచేయనందున వారిని ఫ్యాకల్టీగా భావించడంలేదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోపు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
ఎంటెక్ సీట్లకు కోత
బయోమెట్రిక్ హాజరును పాటించని కాలేజీలపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎంటెక్ సీట్లకు కోత విధించాలని వర్సిటీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి బీటెక్ సీట్లకు జేఎన్టీయూ అనుమతి ఇవ్వగా, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సులకు అనుమతులివ్వలేదు. బయోమెట్రిక్ను పెడచెవిన పెట్టిన కాలేజీలకు ఎంటెక్ సీట్లకు కోతపెట్టాలని అధికారులు నిర్ణయించారు. కొన్ని కాలేజీలు సిలికాన్ తంబ్లు (వేలిముద్రలు) వాడుతున్నాయని, ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్కూల్స్ అండ్ టెక్నికల్స్ కాలేజెస్ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోశ్కుమార్ కోరారు. ప్రైవేట్ వర్సిటీలు, డీమ్డ్ వర్సిటీల్లోని వారిని ఫ్యాకల్టీగా చూపిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని విజ్ఞప్తిచేశారు.