హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఈసీఈ వంటి కోర్ గ్రూప్ కోర్సులను ఎట్టిపరిస్థితుల్లో మూసివేయబోమని జేఎన్టీయూహెచ్ స్పష్టంచేసింది. ఇందుకు కాలేజీలకు అనుమతులిచ్చే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేట్, నిర్మాణ, ఉత్పాదక రంగాల్లో మంచి అవకాశాలు ఉం టాయని వెల్లడించింది. ఈ కోర్ గ్రూప్ కోర్సుల్లో తగి న విద్యార్థులు లేకపోయినా కనీసం 30 సీట్లతో డిపార్టుమెంట్లను కొనసాగించాలని జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ తెలిపారు.
వర్సిటీ నిబంధనలను పాటించకుండా కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) డిపార్టుమెంట్లనే నిర్వహించాలనుకొనే యాజమాన్యాలకు అనుమతులివ్వబోమని, వీటికి వచ్చే విద్యాసంవత్సరంలో అఫిలియేషన్లు నిలిపివేస్తామని పేర్కొన్నారు. కొన్నేండ్ల క్రితమే పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కోర్ గ్రూపుల కోసం డిపార్టుమెంట్లు, టీచింగ్ ఫ్యాక ల్టీ, ల్యాబ్ల వంటివి ఏర్పాటు చేసి ఉన్నాయని, వాటి ని ఇప్పుటికిప్పుడు క్లోజ్ చేయడం మంచిది కాదని వర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. జేఎన్టీయూ నిర్ణయంతో కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్ల సంఖ్యను పెంచుకొనేందుకు సిద్ధమవుతున్న కాలేజీలకు షాక్ తగిలినట్టయింది.
దరఖాస్తు చేసుకున్న సగానికిపైగా కాలేజీలు
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు జరుగుతున్నదని, త్వరలోనే దరఖాస్తుల వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అధికారులు వెల్లడించారు. కాగా, ఈసారి ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల క్లోజర్ కోసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలిపారు.