హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లాలో జేఎన్టీయూ అనుబంధ ఇంజినీరింగ్ కాలేజీ త్వరలోనే ఏర్పాటుకాబోతున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే తరగతుల నిర్వహణకు జేఎన్టీయూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తొలుత టైక్స్టైల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్, ఈసీఈ వంటి నాలుగు నుంచి ఆరు కోర్సులతో కాలేజీని ప్రారంభించాలని యోచిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన నేపథ్యం లో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించా రు. దీంతో జేఎన్టీయూ ఆ ప్రక్రియను వేగవంతంచేసింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం కాలేజీ నిర్వహణకు అనువైన భవనాల కోసం అన్వేషిస్తున్నది. భవనాల ఎంపిక పూర్తికాగానే అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు జరిపి, అనుమతులిస్తారు. జేఎన్టీయూకు అనుబంధంగా హైదరాబాద్తోపాటు సుల్తాన్పూర్, కొండగట్టు (జగిత్యాల), మంథనిల్లో ఇంజినీరిం గ్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తో అనుబంధ కాలేజీల సంఖ్య నాలుగుకు పెరుగుతుంది.
జేఎన్టీయూలో మళ్లీ ఎమ్మెస్సీ కోర్సులు
జేఎన్టీయూలో రెండేండ్ల క్రితం మూసివేసిన ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సులను ఈ ఏడాది నుం చి మళ్లీ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఇవి సెల్ప్ ఫైనాన్స్ కోర్సులు. వీటిని సీపీగెట్ ద్వారా భర్తీచేస్తారు. ఈ నెలాఖరులో సీపీగెట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఈ లోపే పీజీ కోర్సుల ప్రారంభంపై ఉత్తర్వులివ్వాలని భావిస్తున్నారు.