హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీవో నంబర్-3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 8న ధర్నాచౌక్లో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ ధర్నాకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసంలో ఆమె మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న ఉద్యోగ నియామకాలన్నీ కేసీఆర్ చేపట్టినవేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్-3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానంతో ఎక్కువమంది మహిళలకు ఉద్యోగాలు రాకుండాపోయే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరువల్ల 626 గురుకుల ఉద్యోగాల్లో మహిళలకు 77 (12శాతం) మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విదిలించని ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అయ్యారో చెప్పాలని సీఎంను కవిత ప్రశ్నించారు. మోదీని పెద్దన్న అని సంబోధించడం ద్వారా బీజేపీ-కాంగ్రెస్ ఒకటేనన్న విషయం తేటతెల్లమైనదని తెలిపారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ మొదటి ముద్దాయిగా ఉన్నారని, ఆ కేసు విచారణను కేంద్రం వేగవంతం చేయాలని కోరారు. సోనియాను బలిదేవత అన్న రేవంత్రెడ్డి ఇప్పుడు సోనియా, రాహుల్గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని గుర్తుపెట్టుకొని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు వదలకుండా రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని దుయ్యబట్టారు. నీరు ఇచ్చే అవకాశం ఉండీ ఇవ్వకపోవడం రైతులపై కక్ష సాధింపు తప్ప మరోటి కాదని మండిపడ్డారు. కాంగ్రెస్కు రైతుల ఉసురు తప్పక తగులుతుందని కవిత పేర్కొన్నారు.