హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలను చేపట్టిందని జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి బృందం ప్రశంసించింది. గురువారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన జార్ఖండ్ జర్నలిస్టు ప్రతినిధి బృందం(16మంది సభ్యుల బృందం) హైదరాబాద్లో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో భేటీ అయ్యింది. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సభ్యులకు అల్లం నారాయణ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు శిక్షణ, మరోవైపు సంక్షేమాన్ని అకాడమీ ద్వారా నెరవేస్తున్నదని చెప్పారు. జార్ఖండ్ జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నలకు అల్లం నారాయణ సమాధానాలిచ్చారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమనిధి ఏర్పాటు చేశారని అన్నారు. దీని ద్వారా ఇప్పటివరకు ఆరేండ్లలో ప్రభుత్వం తరఫున రూ.42 కోట్లను విడుదల చేశామన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఈ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటివరకు 456 మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఒకొకరికి రూ.లక్షతో పాటు పాటు ప్రతినెలా రూ.3వేల పింఛన్ ఐదేండ్ల పాటు ఇస్తున్నదని వివరించారు. మరణించిన జర్నలిస్టుల పిల్లలకు చదువుకోవడానికి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు నెలనెలా రూ.వెయ్యి ట్యూషన్ ఫీజు చెల్లిస్తున్నదని చెప్పారు. తీవ్ర అనారోగ్యం, ప్రమాదబారిన పడిన జర్నలిస్టు పని చేయలేని స్థితిలో ఉంటే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అకాడమీ అందజేస్తున్నదని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దాదాపు 20వేల అక్రెడిటేషన్లు జారీ చేసినట్టు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్యకార్డు ద్వారా కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స సౌకర్యం కల్పిస్తున్నదని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు బస్ పాస్, రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
తెలంగాణ మీడియా అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నదని, త్వరలో అకాడమీ తన కార్యక్రమాలు కొత్త మీడియా అకాడమీ భవనంలో చేపడతామని అన్నారు. జార్ఖండ్ ప్రెస్ సలహాసమితి బృందంలో యూఎన్ఐ వినయ్కుమార్(దైనిక్ భాసర్), ప్రదీప్కుమార్ సింగ్(ట్రైబల్ టీవీ), సురేంద్రలాల్(షోరూం), ఏఐఆర్ అబ్దుల్ హమీద్ తదితరులు ఉన్నారు. మీడియా అకాడమీ కార్యకలాపాల నివేదికలు ప్రచురించిన పుస్తకాలు, బైలాస్ను జార్ఖండ్ జర్నలిస్టులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జర్నలిస్టు నాయకుడు మారుతీసాగర్, అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీని సందర్శించిన జార్ఖండ్ జర్నలిస్టులు
జార్ఖండ్ అసెంబ్లీ ప్రెస్ అడ్వయిజరీ కమిటీ కో-ఆర్డినేటర్ ఆనంద్ మోహన్ నేతృత్వంలోని 16మంది సభ్యుల ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర శాసన సభను సందర్శించింది. ఈ బృందానికి రాష్ట్ర శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు స్వాగతం పలికారు. అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, తెలంగాణ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ వీ. సూరజ్ కుమార్తోపాటు ఏడుగురు కమిటీ సభ్యులతో జార్ఖండ్ బృందం సమావేశమైంది. రాష్ట్ర శాసనసభా సమావేశ మందిరం, కమిటీహాల్స్, ఆఫీసర్స్ వెయిటింగ్లాంజ్, మినిస్టర్స్ చాంబర్స్, వీడియో కాన్ఫరెన్స్ రూమ్, లైబ్రరీలను సందర్శించిన జార్ఖండ్ బృందం హర్షం వ్యక్తం చేసింది. అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీతో జార్ఖండ్ ప్రతినిధి బృందం సమావేశమైంది.
జర్నలిస్టులకు కల్పిస్తున్న సదుపాయాలు, అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి చేస్తున్న ఏర్పాట్లు, వసతుల గురించి తెలుసుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ స్పీకర్ ప్రెస్ అడ్వయిజరీ కమిటీకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తారని, అనివార్య కారణాలతో ఆయన రాలేదని జార్ఖండ్ ప్రతినిధి బృందం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాలపై జార్ఖండ్ బృందం ఆరా తీసింది. వీరు శుక్రవారం యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకోనున్నారు.