హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సమకాలీన జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్టు తెలిసింది. బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలపై హేమంత్ సొరేన్ ఆరా తీసినట్టు సమాచారం. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష, చమురు ధరలపై కేంద్రం వైఖరి తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. వీరి భేటీ దాదాపు గంటపాటు కొనసాగింది. ఈ సందర్భంగా హేమంత్ సొరేన్ తల్లి రూపీ సోరెన్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. క్లోమ (ప్యాంక్రియాస్) గ్రంథి సమస్యలతో రూపీ సొరేన్ గురువారం హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ (ఏఏజీ)లో చేరారు. సీఎంల భేటీలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.