హైదరాబాద్, జూలై 29: సీఎం రమేష్ అంటే చీటింగ్, మనీ లాండరింగ్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి (Jeevan Reddy) మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ , తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ కోసం పనిచేస్తున్న బ్రోకర్ అని, రాజకీయంగా పెద్ద జోకర్ అని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు పోషిస్తున్న సుపారీ కిల్లర్ అని, డబ్బు మూటల కోసం దళారిగా, రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని చంపేసే తలారీగా మారాడని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అధికారం అండతో ప్రజాధనాన్ని మెక్కే పందికొక్కు సీఎం రమేష్.. చంద్రబాబు నాయుడుకు బినామీ, దోపిడీలో సునామీ అని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో కాంగ్రెస్ నేతలతో కలిసి అక్రమ దందాలతో డబ్బు కూడబెట్టుకుంటూ తనపై ఈడీ, ఐటీ దాడులు తప్పించుకునేందుకు బీజేపీ పంచన చేరాడని దుయ్యబట్టారు. హెచ్సీయూ భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్ల అప్పు తీసుకోవడంలో రేవంత్ సర్కారుకు బ్రోకర్గా పని చేశాడని ఆరోపించారు.
దానికి ప్రతిఫలంగా ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ ఆడుతున్న అవినీతి ఆటలో రూ.13వందల కోట్ల టెండర్లు దక్కించుకున్నారని, అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు, రేవంత్ తరపున వకాల్తా పుచ్చుకొని బీఆర్ఎస్పై సీఎం రమేష్ విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ దాడి చేసిండన్నారు. సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల స్క్రిప్టులో భాగమేనని, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో లబ్ది కోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుట్రలు షురూ చేసిందనడానికి ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పారు. చంద్రబాబు, రేవంత్ ఆదేశాల ప్రకారమే తెలంగాణలో అన్నదమ్ముల్లా బతుకుతున్న ప్రజల మధ్య కులాల కుంపటి రాజేసే కుట్ర జరుగుతోందన్నారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలను బీఆర్ఎస్కు దూరం చేసే దుష్ట పన్నాగం పన్నారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం లభించిందన్నారు. కమ్మ సామాజిక వర్గంపై కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు సీఎం రమేష్ గోబెల్స్ మాటలు చెప్పడం ఈ దశాబ్దపు జోక్గా అభివర్ణించారు.
కమ్మ సామాజిక వర్గానికి ఏ పార్టీలో లభించనంత గౌరవం బీఆర్ఎస్లోనే దక్కిందన్నారు. కమ్మ సామాజికవర్గం వారు బీఆర్ఎస్కు అవసరం లేదని కేటీఆర్ అన్నట్లు రమేష్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దమన్నారు. నిన్నటికి నిన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందితే కేటీఆర్ కుటుంబం ఎలా స్పందించిందో ప్రజలంతా చూశారన్నారు. గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయనను బతికించుకోవడానికి అత్యాధునిక వైద్య చికిత్స అందేలా కేటీఆర్ ఫ్యామిలీ చేయని ప్రయత్నం లేదని తెలిపారు. దురదృష్ట వశాత్తూ అనారోగ్యంతో మరణించగా ఆయన అంత్యక్రియల దగ్గర నుంచి దశదిన కర్మల వరకూ కేటీఆర్ కుటుంబమంతా అక్కడే ఉండి అంతా తామే అయి అన్ని కార్యక్రమాలు జరిపించిన విషయం సీఎం రమేష్ గుడ్డి కండ్లకు కనిపించలేదా? అని ఆయన నిలదీశారు. గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, సూపర్ స్టార్ కృష్ణ వంటి వారు చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత బావ మరిది హరికృష్ణ దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతే వారి అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో జరిపించడమే కాక ఆయన స్మారక చిహ్నం కోసం భూమి కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వమన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు.
ఆరు ఎమ్మెల్యే టిక్కెట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చి వారిని గెలిపించుకోవడమే కాక మంత్రివర్గంలోకి తీసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఖమ్మం ఎంపీగా గెలిచిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నామా నాగేశ్వరరావును లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేతగా చేయలేదా? అని ఆయన రమేష్ పై నిప్పులు చెరిగారు. మూడు నాలుగు జిల్లాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చి సమున్నత గౌరవం కలిపించామని, తాతా మధుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆరేనని చెప్పారు. ఇంకా పలు ప్రభుత్వ, పార్టీ పదవులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇచ్చామన్నారు. ఇంత చేసిన కేసీఆర్ ఫ్యామిలీ కమ్మ సామాజిక వర్గానికి వ్యతిరేకమని రమేష్ లాంటి బ్రోకర్లు ప్రచారం చేస్తే నమ్మేదెవరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ సింహం లాంటోడని, సీఎం రమేష్ వంటి ఊరకుక్కలతో బహిరంగ చర్చకు రమ్మంటే ఎలా వస్తారని ఆయన మండిపడ్డారు. సీఎం రమేష్ దొంగల ముఠాను తెలంగాణ పొలిమేరల దరి చేరనివ్వబోమని, హైదరాబాద్లో కాలుపెట్టకుండా తరిమికొడతాం ఖబడ్దార్ అని హెచ్చరించారు.
కేసీఆర్ ఫ్యామిలీపై బండి సంజయ్ తొండి మాటలు
కేసీఆర్ ఫ్యామిలీ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతూ అదేపనిగా బురదజల్లుతున్నాడని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతల తీరు బీఆర్ఎస్ పై కక్ష, కాంగ్రెస్కు రక్ష అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బీజేపీ గ్రూపుల కుమ్ము లాటలతో సతమతమవుతూ ప్రజల్లో పరువు పోగొట్టుకుంటోందని ఆయన అన్నారు. బీజేపీ కుమ్ము లాటల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే బండి సంజయ్తో సహా పలువురు ఆ పార్టీ నేతలు పొద్దున లేస్తే బీఆర్ఎస్పై ఏడుస్తూ కేసీఆర్, కేటీఆర్పై విషం కక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇద్దరు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి నయాపైసా నిధులు తేకపోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్ని కపట నాటకాలాడినా తెలంగాణలో ఆ పార్టీ ఎప్పటికీ సింగిల్ డిజిట్ పార్టీగానే మిగిలిపోతుందని జీవన్ రెడ్డి తెలిపారు.