హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ -2 తుది ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. ఫలితాల ప్రకారం రాష్ర్టానికి చెందిన సింగరాజు వెంకట కౌండిన్య 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. ఈ నెల 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్ -2 ఎగ్జామ్ నిర్వహించగా, ఈ నెల 19న ప్రాథమిక కీ విడుదలైన విషయం తెలిసిందే.
పైనల్ కీలో 24 మార్పులు
జేఈఈ మెయిన్ -2లో ప్రశ్నపత్రాల కూర్పులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తుది ‘కీ’లో 24 మార్పులు చేశారు. కెమిస్ట్రీలో 9, గణితంలో 12, భౌతికశాస్త్రంలో 3 చొప్పున మార్పులు చేశారు. ఈ 24 మార్పుల్లో 8 ప్రశ్నలను తొలగించడం గమనార్హం. ఇలా గతంలో ఎన్నడూ జరుగలేదని నిపుణులు పేర్కొన్నారు. తప్పుగా ప్రశ్నపత్రాల రూపొందించడం విద్యార్థుల ర్యాంకులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.