JEE Advanced | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు డిజిటల్ వాచ్లే కాకుండా అనలాగ్ వాచ్లు, హ్యాండ్బ్యాగ్లు, పర్సులను కూడా అనుమతించరు. విద్యార్థులు చెప్పులు, శాండిల్స్ మాత్రమే ధరించాలి.
ఉంగరాలు, చెవిపోగులు, ముక్కుపుల్లలు, చైన్లు, నెక్లెస్లు, పెండెంట్లు, బ్యాడ్జీలు, హెయిర్ పిన్నులను ధరించొద్దు. విద్యార్థులు అడ్మిట్కార్డుతోపాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ను వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్కార్డు మీద పేరెంట్స్ కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్లో క్వాలిఫై అయిన 2.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అడ్వాన్స్డ్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్తోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.