సూర్యాపేట: మత సామరస్యానికి ప్రతీక అయిన జాన్పహాడ్ జాతర ప్రారంభమయింది. సూర్యాపేట జిల్లాలోని జాన్పహడ్లో సైదన్న ఉర్సు ఉత్సవాలు గుసుల్ కార్యక్రమంతో మొదలయ్యాయి. ఉత్సవాలు నేటినుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. సమాధులపై పవిత్ర గంధం చల్లి పూలతో చాదరు ఏర్పాటు చేశారు.
తెల్లవారుజామున బాబా సమాధులకు జల్సా ఈ సిరత్ అల్లా నమాజ్ నిర్వహించారు. జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా రేపు పవిత్ర గంధోత్సవం నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు దీపారాధనతో ఉర్సు ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఉత్సవాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచేకాకుండా రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
నాలుగు శతాబ్దాల క్రితం మద్రాస్ రాష్ట్రంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టత పొరుగు రాష్ట్రమైన ఆంధ్రరాష్ట్రంలో కూడా వ్యాపించింది. దీంతో ఆంధ్రరాష్ట్రంలోనూ దర్గా విశిష్టతను ప్రచారం చేయాలని జాన్పహాడ్ సైదా, బాజీ సైదా, మొయినుద్దీన్ అనే ముగ్గురు మద్రాస్ నుంచి బయలుదేరి ఆంధ్రరాష్ట్రానికి వచ్చినట్లు ప్రచారంలో ఉంది. నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటిచెబుతూ ఊరూరా తిరుగుతున్న క్రమంలో వారి వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారు. వాడపల్లి వద్ద అమరుడైన జాన్పహాడ్ సైదా జ్ఞాపకార్థం వజీరాబాద్ రాజకుమారుడు జాన్పహాడ్ వద్ద సమాధులు కట్టించారని చెబుతారు. తదనంతర కాలంలో జాన్పహాడ్ సైదులు దర్గాగా వాడుకలోకి వచ్చింది.