జనగామ, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): యాదాద్రికి దీటుగా వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గుట్టపై నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో చినజీయర్స్వామి మంగళశాసనములతో శ్రీసీతారామాంజనేయ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీశ్, ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. వారికి పూర్ణకుంభంతో ఎర్రబెల్లి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య స్వాగతం పలికారు.
ముందుగా సీతారాముల విగ్రహాన్ని, అనంతరం ఆలయ సన్నిధిలో ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో పురాతన దేవాలయాల అభివృద్ధితో పాటు నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు అత్యధికంగా నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ధూప, దీప, నైవేద్యం కింద 7 వేల దేవాలయాలకు నిధులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. గతంలో ధూపదీపనైవేద్యం కింద రూ.6 వేలు ఉండేదని, ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచామని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణం చేపడుతూ ప్రజల్లో భక్తిభావాన్ని పెంచుతున్నారని వివరించారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ పదేండ్లలో రాష్ట్రంలో ఎలాంటి కరువు కాటకాలు రాలేదని, దేవుడి ఆశీస్సులు రాష్ట్రంపై, రాష్ట్ర ప్రజలపై ఉన్నదని తెలిపారు. మునులగుట్టపై రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చినజీయర్స్వామి కోరగా సీతారామచంద్రస్వామి కొండ నుంచి మునులగుట్టను కలుపుతూ వేలాడే వంతెనను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో పాలకుర్తి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, ఆయన నియోజకవర్గ అభివృద్ధికి పట్టువదలని విక్రమారుకుడిలా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశ స్థాయిలో అనేక అవార్డులు తీసుకున్న ఘనత ఆయనకే దకుతుందని పేర్కొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణం కోసం సీఎం కేసీఆర్ యాగాలు చేశారని, ఫలితంగా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో యాదాద్రి మొదలు అనేక దేవాలయాలు పునరుజ్జీవం పోసుకుంటున్నాయని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని వెల్లడించారు. గొప్ప చరిత్ర కలిగిన వల్మిడి ఆలయాన్ని ఎర్రబెల్లి దయాకర్ పునఃప్రతిష్ఠించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, ఈ కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ఆలయాలకు పూర్వ వైభవం వస్తున్నదని అన్నారు. వాల్మికీ పుట్టినగడ్డ వల్మిడి అని వల్మిడి స్థల పురాణాన్ని వివరించారు. అడగ్గానే ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేశారని పేర్కొంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. సన్నూరు వేంకటేశ్వర ఆలయాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ పచ్చగా కొనసాగాలి: చినజీయర్
‘మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భావం పెంపొందించడానికి, మానసిక ధైర్యం ఇచ్చేందుకు ఆలయాలు అవసరం’ అని చినజీయార్స్వామి తెలిపారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. వల్మిడి ఆలయాన్ని పునఃనిర్మించిన మంత్రి దయాకర్రావును ప్రత్యేకంగా అభినందించారు. ప్రాచీన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసి ఆరాధనను మళ్లీ పునరుద్ధరించడం చాలా గొప్ప కార్యమని తెలిపారు. రూ.కోట్లు వెచ్చించి ఈ ఆలయాన్ని గొప్పగా పునఃనిర్మించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీలు దయాకర్, కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ శివలింగయ్య దంపతులు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక దంపతులు, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ సీతారాం, ఎర్రబెల్లి ట్రస్టు చైర్పర్సన్ ఉషా దయాకర్రావు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర, లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్యశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాలయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.