జనగామ చౌరస్తా, మార్చి 2 : జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తొలి సారి నిర్వహించిన ప్రజావాణిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెరుకు సోమనర్సయ్య తన భూ సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి రాగా అర్జీదారుడి చేతిపై దురదతో వాపు ఉండడాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ గమనించారు. చేతికి ఏమైందని బాధితుడిని కలెక్టర్ అడగ్గా మూడు రోజుల క్రితం చేతిపై జెర్రి పాకిందని సోమనర్సయ తెలుపడంతో అతడిని వెంటనే వైద్య చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు పంపించాలని డీఎంహెచ్ వోను ఆదేశించారు.
బాధితుడికి ఒక వ్యక్తిని సహాయంగా హాస్పిటల్కు పంపించి చికిత్సను అందించారు. డాక్టర్ల సూచన మేరకు అవసరమైన మందులు తీసుకున్న బాధితుడు ఆ తర్వాత మళ్లీ ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వైద్య సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత సదరు బాధితుడు వచ్చిన భూ సమస్య పై కలెక్టర్ కు అర్జీ సమర్పించి వెళ్లాడు. ఇంట్లోవారి ఆరోగ్య సమస్యల గురించి కుటుంబ సభ్యులే సరిగా పట్టించుకోని ఈ కాలంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు.