BJP | హుజూరాబాద్/జమ్మికుంట, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): అది బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. తనకు అత్యంత పట్టున్న ప్రాంతమని ఈటల చెప్పుకొనే గడ్డ.. అలాంటి చోట బీజేపీకి ఘోర అవమానం జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను ఆహ్వానించి సభ నిర్వహిస్తే జనం లేక ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. కాషాయ పార్టీపై జనం విముఖత చూపడంతో సభ వెలవెలబోయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంటలో బీజేపీ నాయకులు సోమవారం జనగర్జన పేరుతో సభ నిర్వహించారు. కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డిసహా స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్న ఈ సభకు జనమెవ్వరూ రాలేదు. రాజ్నాథ్సింగ్ మాట్లాడుతుండగా.. కాస్తో కూస్తో ఉన్న జనంకూడా లేచి వెళ్లిపోవడం కనిపించింది. తన ఎదుట జనం ఉన్నారా? లేరా? అనేది గమనించకుండానే రాజ్నాథ్సింగ్.. తెలంగాణ బీజేపీ నాయకులు రాసిచ్చిన ప్రసంగాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే సభ మొత్తం ఖాళీ అయిపోవడం గమనార్హం.
పసలేని ప్రసంగాలు..
కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఇప్పటి వరకు ఏం చేశారో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పకుండా అధికార బీఆర్ఎస్పై అడ్డగోలు ఆరోపణలకే ప్రసంగాన్ని పరిమితం చేశారు. రాజ్నాథ్.. ప్రధాని మోదీ తరహాలో తెలంగాణ ఆవిర్భావంపై విషం చిమ్మారు. ‘వాజపేయి హయాం లో మూడు రాష్ర్టాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్యలు లేవు. కానీ కాంగ్రెస్ ఏపీని విభజిస్తే ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి జరగడంలేదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఈటల మాట్లాడుతూ రైతుబంధు తరహాలో తాము ఎకరాకు రూ. 9 వేలు ఇచ్చే ఆలోచన చేస్తామని అస్పష్టంగా చెప్పారు. కానీ, అది ఆరు నెలలకా? ఏడాదికా? అనే విషయాన్ని స్పష్టీకరించలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇస్తుండగా, తాజా మ్యానిఫెస్టోలో రూ.16 వేలకు పెంచుతామన్న విషయంపై కూడా పూర్తిగా అవగాహన లేకుండా ఈటల చేసిన వ్యాఖ్యలు ఓట్లు దండుకునే దిశగా సాగాయి. కేంద్రం నుంచి పెద్ద మొత్తం లో నిధులు తెచ్చి హుజూరాబాద్ను అభివృద్ధి చేస్తానని గత ఉప ఎన్నికలో అనేక హామీలు ఇచ్చిన ఈటల రాజేందర్.. ఇప్పటి వరకూ ఏం చేశాడో చెప్పలేక పోయారు. మొత్తంగా అబద్ధపు మాటలు.. అసత్యపు ఆరోపణలతో ప్రసంగాన్ని ముగించారు.
ఈటలపై కోపం.. ‘బండి’ దూరం!
ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరైన జమ్మికుంట జనగర్జన సభకు బీజేపీ కీలక నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరు కాకపోవడంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సఖ్యత లేదని, ఇప్పటికే వీరిద్దరూ ఎడమొఖం.. పెడమొఖంగా ఉంటున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది.అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత మొదటిసారిగా జరిగిన ఈ సభకు బండి సంజయ్ ఎందుకు రాలేదని పలువురు చర్చించుకోవడం కనిపించింది. కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ పేరును ఏ ఒక్క నాయకుడు కూడా ఉచ్ఛరించని పరిస్థితి ఎందుకొచ్చిందని అందరూ అనుమానం వ్యక్తంచేశారు. కావాలనే బండి సంజయ్ని ఈటల దూరం పెడుతున్నారని ఆ పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం.