హైదరాబాద్: గోదావరి (Godavari), కావేరీ నదుల అనుసంధానంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. నదుల అనుసంధానంపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఐదు రాష్ట్రాల జలవనురల శాఖ అధికారులు హాజరుకానున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల జలవనరుల కార్యదర్శులకు జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (SWDA) ఇప్పటికే లేఖ రాసింది. ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనుంది.
ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఎస్డబ్ల్యూడీఏ సుమారు రూ.75 వేల కోట్ల వ్యయ అంచనాతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించింది. సముద్రంలో కలుస్తున్న 247 టీఎంసీల గోదావరి జలాలను వినియోగంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది.
అయితే, మొత్తం ఖర్చులో 90 శాతం కేంద్రం, 10 శాతం ఖర్చు ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంది. తెలంగాణ సుమారు 80 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 90 టీఎంసీలు, పుదుచ్చేరి 5 టీఎంసీలు, తమిళనాడు 45 టీఎంసీలు, కర్ణాటక 25 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. కాగా, తమ రాష్ట్ర అవసరాలు తీరినతర్వాతే నదుల అనుసంధానం ద్వారా నీటిని తరలించడానికి ఒప్పుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.