హైదరాబాద్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే ఉన్న ప్రజా గాయకుడు గద్దర్తో కలిసి మంత్రి కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం సాధించడానికి జీవితాన్నే అంకితం చేశారన్నారు. నవభారత నిర్మాణానికి ఆయన అలు పెరుగని కృషి చేశారని పేర్కొన్నారు.
ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. భారతదేశపు మొదటి మంత్రి వర్గంలో కార్మిక మంత్రిగా సేవలందించారన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎన్నో కొత్త చట్టాలు, సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువ లేనిదన్నారు. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికారని చెప్పారు.