జగిత్యాల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): దేశానికి స్ఫూర్తి నింపేలా సీఎం కేసీఆర్ హైదరాబాద్లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. విగ్రహ ఏర్పాటు, సచివాలయానికి పేరు పెట్టడంపై సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతూ జగిత్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ భవన్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో వెల్గటూర్ జడ్పీటీసీ సుధారాణి తీర్మానాన్ని ప్రతిపాదించగా, మరో జడ్పీటీసీ మహేశ్ బలపర్చడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటి అంబేద్కర్ దార్శనికత, రాజనీతిజ్ఞత, తార్కికత, సమానత్వ భావం సీఎం కేసీఆర్లో మూర్తీభవించాయని పేర్కొన్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ జడ్పీటీసీ సుధారాణి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఎంపీపీలు చిట్టిబాబు, స్వర్ణలత బలపర్చడంతో ఏకగ్రీవంగా ఆమోదించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేయాలంటూ జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి తీర్మానాన్ని ప్రతిపాదించగా, జడ్పీటీసీ జాదవ్ అశ్వినీ బలపర్చడంతో ఏకగ్రీవంగా ఆమోదించారు. పైరెండు తీర్మానాల ప్రతులను ప్రధాని మోదీకి పంపేందుకు అదనపు కలెక్టర్ మకరంద్కు సభ్యులు అందజేశారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ను సభ్యులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.