ధర్మపురి : జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివార్ల (యోగ, ఉగ్ర) ఉత్సవ మూర్తులను సేవలపై ఉంచి వరాహతీర్థం, పుట్టబంగారం కోసం తీసుకెళ్లారు. చింతామణి చెరువు కట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మట్టిని తవ్వి ఆలయాలకు పుట్టబంగారం తీసుకొచ్చారు. పూజల అనంతరం భక్తులు పుట్టబంగారాన్ని సేకరించి ఇంటికి తీసుకెళ్లారు. దీన్ని పంటపొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల నమ్మకం.