జగిత్యాల, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ‘పోలీస్ కిష్టయ్య నీ త్యాగం.. మా కష్టాలను తుడిచే.. ఉద్యమనేత కేసీఆర్ తెలంగాణను సాధించే’ అంటూ జగిత్యాల ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ స్వయంగా పాటను రాసి చిత్రీకరించారు. ఈ సీడీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. తెలంగాణ సాధన, ఉద్యమంలో పోలీసు కిష్టయ్య అమరత్వం, ఉద్యమ నేతగా కేసీఆర్ పోరాట పటిమ, రాష్ట్ర ఆవిర్భావం, ఆ తర్వాత పోలీసు శాఖలో కేసీఆర్ తెచ్చిన సంస్కరణలను భూమికగా చేసుకొని రచించిన ఈ గేయాన్ని నల్లగొండకు చెందిన ప్రముఖ సింగర్ నర్సిరెడ్డి అలియాస్ నల్లగొండ గద్దర్తో పాడించారు.
తెలంగాణ ఉద్యమ దృశ్యాలు, పార్లమెంట్లో జరిగిన చర్చలు, కేసీఆర్, ఇతర పార్టీల ప్రముఖుల ప్రసంగ దృశ్యాలు, రాష్ట్ర ఏర్పాటు దృశ్యాలు, అనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు, సంస్కరణలకు సంబంధించిన అంశాలను చిత్రీకరించారు. గత నెల 25న సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ పదేండ్ల ప్రస్థానానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారని ఎస్పీ భాస్కర్ తెలిపారు. 9 ఏండ్ల కాలంలో పోలీసు శాఖలో తెచ్చిన సంస్కరణలను కేసీఆర్ సోదాహరణంగా వివరించారని, ఆ అంశాలనే ఆలంబనగా చేసుకొని పాటను రాసినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ స్పూర్తితోనే ఈ గేయం పుట్టిందని అన్నారు.