హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ‘2004 నుంచి సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలని కొట్లాడుతున్నా. ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు’ అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీలైనా ప్రభుత్వం చేసే అన్ని పనులను విమర్శించకూడదన్నారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిందని కొనియాడారు. కల్యాణలక్ష్మి గొప్పగా ఉన్నదని, ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచన చేయాలని కోరారు. ‘కేంద్రం మస్తు నరుకుతుంది’ అంటున్నవారు రాష్ర్టానికి ఏం ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మియాపూర్-సంగారెడ్డి, హైదరాబాద్- యాదగిరిగుట్టకు మెట్రో విస్తరించాలని కోరారు.