హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు హీరోలైతే.. రేవంత్రెడ్డి విలన్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. రేవంత్ తనను వ్యక్తిగతంగా అనేకసార్లు అవమానించాడని తెలిపారు. రేవంత్ మాయలో పడొద్దని కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గాల బాధ్యతల నుంచి తనను తప్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తడాఖా ఏమిటో రేవంత్కు చూపిస్తానని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ ఇటీవల అనారోగ్యంతో దవాఖానలో చేరినప్పుడు రేవంత్ తనను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడటంతో తామిద్దరం కలిసిపోయినట్టు బయటకు సంకేతాలు వెళ్లాయన్నారు. సీఎం కేసీఆర్ పరిస్థితి సీరియస్గా ఉన్నదని, కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నందున మనమంతా అప్రమత్తంగా ఉండాలని ఆ రోజు రేవంత్ తనతో చెప్పినట్టు తెలిపారు. ‘ముత్యాలముగ్గు’ సినిమాలో మాదిరిగా ఆ రోజు గదిలో జరిగింది ఒకటైతే.. బయట మరోలా ప్రచారం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను రేవంత్ నట్టేట ముంచడం ఖాయమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.