సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అందిస్తున్న చేయూత వల్ల మాంసం ఉత్పత్తులు దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకోబోతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ (Sheep Distribution) కార్యక్రమాన్ని శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమాట్ల గ్రామంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) సంకల్పంతో కుల వృత్తులకు ప్రాధాన్యత పెరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పాలించిన నాయకులు కులవృత్తులను విస్మరించడంతో తెలంగాణలో ఆకలి చావులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సుభిక్షంగా మార్చిన ఘనత కేసీఆర్ దే నన్నారు.
గొర్రెల పెంపకం రాష్ట్రానికి పెద్ద పెట్టుబడిగా మారనుందని వివరించారు. గొర్రెల పెంపకానికి అనుబంధంగా పరిశ్రమలు(Industries) ఏర్పాటు చేసే వేసులు బాటు ఉంటుందన్నారు . అందులో మొదటిది తోళ్ల పరిశ్రమ అయితే, మరోటి మాంసాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి చేసేందుకు వీలుగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పరిశ్రమల స్థాపనకు అవకాశం ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లా పొట్టేలు మాంసానికున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గొర్రెలను పెంచగలిగితే గొర్ల కాపరులు ఆర్థికంగా సుసంపన్నం అవుతారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ బిక్షం, జిల్లా పశు సంవర్ధకశాఖా అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.