CM KCR | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం.. 23 వేల కుటుంబాల్లో సంతోషం నింపిందని వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు తమ కుటుంబాలన్నీ రుణపడి ఉంటాయని జేఏసీ అధ్యక్షుడు రాజయ్య, సహ అధ్యక్షుడు రమేశ్ బహదూర్ తెలిపారు. సచివాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 23 వేల మంది వీఆర్ఏలు పని చేస్తున్నారని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని సీఎం కేసీఆర్ 2017 ఫిబ్రవరి 27న హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీని అమలు చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ఈ రోజును తమ జీవితంలో మర్చిపోలేమని చెప్పారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా తమ కుటుంబాలకు శుభవార్త చెప్పడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.
క్రమబద్ధీకరణకు సహకరించిన మంత్రులు హరీశ్రావు, కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, సీసీఎల్ఏ మాజీ కమిషనర్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. వీఆర్ఏల క్రమబద్ధీకరణ నిర్ణయాన్ని హర్షిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. సమావేశంలో జేఏసీ నాయకులు వెంకటేశ్ యాదవ్, రఫీ, మాధవ్నాయుడు, ఉమా మహేశ్వర్, కొండా రాజేందర్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు ఇది అండగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.