కవాడిగూడ, ఫిబ్రవరి 28 : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. మౌన, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు.
ప్లకార్డులు పట్టుకొని భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఇప్పటికే సేవలు అందిస్తున్న ఏ ఉద్యోగినీ తొలగించబోమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఏజెన్సీ వ్యవస్థను రద్దుచేసి ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, మెడికల్ సదుపాయాలు, చెల్లింపు సెలవులు అమలు చేయాలి.
మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. పదవీ విరమణ చేసిన, సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం అందించే విధానాన్ని అమలుచేయాలి’ అని డిమాండ్ చేశారు. తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీ మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోల సమస్యలు పరిష్కరించకుంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలతో వచ్చి హైదరాబాద్ను దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దుర్గం శ్రీనివాస్, బాలకృష్ణారెడ్డి, సంతోష్, క్రాంతికుమార్, మహ్మద్ రాజ్ అహ్మద్, జ్యోతి, పద్మ, రాజేశ్, శేఖర్రెడ్డి, నజీర్ పాల్గొన్నారు.