హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమాత్రం మారలేదు. అవే అడ్డగోలు మాటలు. తెలంగాణలో పర్యటిస్తున్నాం కాబట్టి అడ్డదిడ్డంగా సీఎం కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుందనే భావనలోనే ఉన్నారు. మహబూబ్నగర్లో గురువారం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన కొన్ని అడ్డగోలు విమర్శలను పరిశీలిస్తే..
నడ్డా: కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్ల రికార్డు సమయంలో పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగు నీరు, కోట్ల ప్రజలకు తాగు నీరు అందిస్తున్నది కనిపించటం లేదా? కాళేశ్వరం తర్వాత తెలంగాణ ధాన్యరాశిగా మారితే, సహించలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లపై కిరికిరి పెట్టేలా చూసింది నిజం కాదా? డబ్బు కోసమే ప్రాజెక్టును కట్టి ఉంటే ఏండ్లపాటు సాగదీసేవాళ్లు కదా! అని విశ్లేషకులు నడ్డాను ప్రశ్నిస్తున్నారు.
నడ్డా: మిషన్ భగీరథలో చుక్క నీరు రాలేదు
నడ్డా గారూ! మీరు మర్చిపోయారేమో. 2016లో నల్లా తిప్పి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది ప్రధాని మోదీనే. అప్పుడు బిందె కూడా నిండింది. నీతి ఆయోగ్ ఈ పథకాన్ని ప్రశంసించి రూ.19,205 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించింది. అయినా కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దేశంలో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్న ఏకైక పెద్ద రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర జలశక్తి శాఖ పదుల సార్లు పొగిడింది. మిషన్ భగీరథ స్ఫూర్తిగా కేంద్రం హర్ ఘర్ జల్ చేపట్టింది. దాదాపు 14 రాష్ర్టాలు మిషన్ భగీరథ వంటి పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవన్నీ నడ్డా కండ్లకు కనిపించటం లేదా? అని తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు.
నడ్డా: మిషన్ కాకతీయలో అవినీతి జరిగింది
మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ పలుమార్లు ప్రశంసించాయి. అంతేకాదు.. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని నీతి ఆయోగ్ స్వయంగా కేంద్రానికి సూచించింది. అయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నడ్డా తప్పుడు ఆరోపణలు చేస్తూ సొంత ప్రభుత్వాన్ని, నీతి ఆయోగ్నే అవమానిస్తున్నారని నిపుణులు ముక్కున వేలేసుకొంటున్నారు.
నడ్డా: రాష్ర్టానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలి
నడ్డా చెప్పినట్టే జరిగితే గత ఎనిమిదేండ్లలో బీజేపీ పాలిత రాష్ర్టాలన్నీ అన్ని రంగాల్లో నంబర్ వన్కు పోటీపడుతూ ఉండాలి. కానీ అన్ని సూచీల్లో యూపీ ఎందుకు అట్టడుగున ఉన్నది. సింగిల్ ఇంజిన్ ప్రభుత్వాలైన తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ర్టాలు ఎందుకు అన్ని సూచీల్లో టాప్లో కొనసాగుతున్నాయో నడ్డా చెప్పాలి.
ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్
జేపీ నడ్డా రాష్ర్టానికి రాక ముందు స్థానిక బీజేపీ నేతలు.. తెలంగాణలో అద్భుతంగా పుంజుకున్నాం, అధికారానికి దగ్గరగా వచ్చేశాం అంటూ ఊదరగొట్టారు. తీరా ఇక్కడికి వచ్చాక రాష్ట్ర నేతల పరిస్థితి, ప్రజల్లో వారికి ఉన్న అభిమానాన్ని చూసి నడ్డా తీవ్ర నిరాశకు గురయ్యారు. నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరటం, కొందరి డైరెక్షన్లో పాదయాత్ర జరుగుతుండటం వంటివి నడ్డా దృష్టిలో పడ్డాయి. దీంతో కీలక నేతలను పిలిచి ‘పదవుల కోసం కొట్లాడటం ఆపండి’ అని గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. అంతేకాదు.. మిమ్మల్ని మాత్రమే నమ్మకుంటే లాభం లేదని, ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించాలని సూచించినట్టు సమాచారం. బీజేపీకి ఆదరణ ఉన్నదని ఊదరగొట్టారని, తీరా చూస్తే పాదయాత్రకు, బహిరంగ సభకు పెద్దగా స్పందనే లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.