హైదరాబాద్, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావం తగ్గినప్పటికీ ఒకవేళ థర్డ్వేవ్ విజృంభించినా ప్రాణనష్టం జరుగకుండా ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేస్తున్నది. మూడోవేవ్ చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే వాదన నేపథ్యంలో ఎంఐఎస్-సీ ప్రభావాన్ని తగ్గించే ఇంట్రావీనస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ (ఐవీఐజీ) ఇంజెక్షన్ల సమీకరణపై దృష్టి సారించింది. ఇప్పటికే గాంధీ, నిమ్స్ దవాఖానల్లో మూడువేల యూనిట్ల ఇంజెక్షన్లు అందుబాటులో ఉండగా.. మరో 7 వేల యూనిట్లు సమకూర్చుకొనేందుకు వైద్యసేవలు, మౌలికసదుపాయాల అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. సాధారణంగా చిన్నారుల్లో కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదు. వైరస్ మ్యుటేషన్స్ వల్ల కరోనా సోకిన చిన్నారుల్లో మల్టీసిస్టం ఇన్ఫ్లేమటరీ సిండ్రోమ్ (ఎంఐఎస్-సీ) ప్రభావం కనిపిస్తున్నది. కొవిడ్ వచ్చిన రెండుమూడు వారాల్లో దీని ప్రభావం మొదలవుతుంది. 5 నుంచి 12 ఏండ్లలోపు పిల్లల్లో దీనిని గుర్తించారు. అలాంటివారికి వెంటనే ఐవీఐజీ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ వైరస్ వల్ల కలిగే ఇమ్యూనిటీ ఓవర్ రియాక్షన్ను ఈ ఇంజెక్షన్ తగ్గిస్తుంది. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ చికిత్స అని వైద్యులు చెప్తున్నారు.
గ్రామాల్లో కొవిడ్పై అవగాహన కల్పించాలి
గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19పై విస్తృత అవగాహన కల్పించాలని ఉన్నత భారత్ అభియాన్ (యూబీఐ) తెలంగాణ ప్రాంతీయ సమన్వయకర్త లఖన్సింగ్ సూచించారు. రాష్ట్రంలో యూబీఐ ప్రాంతీయ సమన్వయ సంస్థగా వ్యవహరిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) సోమవారం కొవిడ్-19 అవగాహన అనే అంశంపై వీడియో, పోస్టర్ పోటీలు నిర్వహించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల నుంచి 35 మంది విద్యార్థులు, ఉన్నత భారత్ అభియాన్ (యూబీఏ) సమన్వయకర్తలు పాల్గొన్న కార్యక్రమంలో లఖన్సింగ్ మాట్లాడుతూ.. కొవిడ్ -19పై స్థానికభాషలు, మాండలికాల్లో అవగాహన కల్పించే సమాచారాన్ని సమకూర్చుకోవడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అనంతరం పోస్టర్, వీడియో మేకింగ్ క్యాటగిరీలో గెలుపొందినవారికి అవార్డులు ప్రకటించారు.
హైదరాబాద్లో 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ను వంద శాతం వ్యాక్సినేటెడ్ నగరంగా మార్చే లక్ష్యంతో ప్రత్యేక మాప్ అప్ డ్రైవ్ను చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చెప్పారు. ప్రత్యేక బృందాలు ప్రతి ఇంటినీ సందర్శించి, వ్యాక్సిన్ వేయించుకోనివారికి తేదీలు, కేంద్రాలు కేటాయిస్తాయని వెల్లడించారు. కుటుంబసభ్యులంతా వ్యాక్సిన్ వేయించుకున్న ఇండ్లకు వ్యాక్సినేటెడ్ స్టిక్కర్ అతికిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో మరే పెద్ద నగరంలోనూ చేపట్టలేదని పేర్కొన్నారు. సోమవారం ఆయన ఖైరతాబాద్ ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా థర్డ్వచ్చే వచ్చే అవకాశం లేదని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పలు జిల్లాల్లో పదిలోపే కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం జీహెచ్ఎంసీలో 57, కరీంనగర్లో 32, ఖమ్మం, హనుమకొండలో 23 చొప్పున, నల్లగొండలో 25 కేసులు మినహా ఇతర అన్ని జిల్లాల్లో సగటున పదిలోపే నమోదయ్యాయి. క్రమంగా కేసులు తగ్గుతుండటంతో కొవిడ్ జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం చూపుతున్నారని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వైరస్ మన చుట్టూనే ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గుర్తించి, మాస్కులు ధరించడంసహా ఇతర అన్ని నిబంధనలు పాటించాలని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 354 పాజిటివ్ కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం 6,308 మంది చికిత్స పొందటం లేదా ఐసొలేషన్లో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.