ITI | ఐటీఐ (ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) కోర్సులకు భలే క్రేజ్ లభిస్తున్నది. ట్రేడ్ పూర్తిచేసిన వెంటనే వివిధ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తుండడంతో యువత ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఆడ్మిషన్లకు అవకాశం ఉండడంతో ఇటువైపు మొగ్గుచూపుతున్నది. ఇప్పటికే ఆన్లైన్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభంకాగా వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం పరిస్థితికి అద్దంపడుతున్నది.
– జమ్మికుంట, మే 28
ఐటీఐ చేస్తున్నాడంటే అంతగా చదువు ఒంటబట్టని విద్యార్థులే ఇందులో చేరతారనే ప్రచారం ఉండేది. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కూడా సరైన అవకాశాలుండేవి కాదు. చిన్నా, చితక ఉద్యోగాలు. చాలీచాలనీ వేతనాలతో ఉద్యోగాలు దొరికేది. కానీ కాలం మారింది. ఇప్పుడు ‘ఐటీఐ రూటు.. ఉపాధికి చోటు’గా మారింది. ఐటీఐ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయా రంగాల్లో స్థిరపడే అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే. పారిశ్రామిక శిక్షణ సంస్థలు నైపుణ్యాభివృద్ధికి కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణలో ఆరితేరేలా తీర్చిదిద్దుతున్నాయి. చిన్నతనంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థిరపడేలా చేస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఐటీఐ వైపు దృష్టి పెట్టారు. కోర్సులకు డిమాండ్ పెరిగింది. కాగా, ప్రభుత్వం ఇటీవల ఐటీఐ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసేందుకు పోటీ పడుతున్నారు.
అందుబాటులో 2912 సీట్లు..
ప్రభుత్వం ఐటీఐ ప్రవేశాలకు ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడుత దరఖాస్తులకు వచ్చే నెల 10వరకు తుది గడువుగా పేర్కొన్నది. ప్రభుత్వ ఐటీఐలో 1012 సీట్లు, ప్రైవేట్ ఐటీఐలో 1952 సీట్లున్నాయి. సదరు సీట్లు ఆయా సందర్భాలను బట్టి పెరిగే, తగ్గే అవకాశాలుంటాయి. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని సమాచారం. ఇక ఐటీఐలో చేరేందుకు పదో తరగతి పాస్ అయిన విద్యార్థులు అర్హులు. అయితే ఐటీఐ ట్రేడులకు పోటీ ఎక్కువైంది. పదో తరగతిలో అత్యుత్తమ గ్రేడింగ్ సాధించిన విద్యార్థులకే ఐటీఐల్లో సీటు దక్కే అవకాశం ఉన్నది. అంతేకాకుండా పారిశ్రామిక ప్రాంతాల యువత ఎక్కువగా ఐటీఐ దిశగా సాగుతున్నారు. సింగరేణి ఉద్యోగాలకు, ఉద్యోగాల్లో ప్రమోషన్లకు ఐటీఐని ఎంచుకుంటున్నారు. పదో తరగతే కాకుండా.. పీజీ చదివిన విద్యార్థులు కూడా పారిశ్రామిక శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తు కోసం ఐటీఐ.తెలంగాణ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 22 ఐటీఐలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ(6), ప్రైవేట్(16) 22 ఐటీఐలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ ఐటీఐలు సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, కాటారంలలో ఒక్కోక్కటి ఉన్నాయి. అలాగే హుజూరాబాద్, జమ్మికుంట, రామగుండం, పెద్దపల్లి, తదితర ప్రాంతాల్లో 16 ప్రైవేట్ ఐటీఐలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని ఐటీఐలో కో-ఎడ్యుకేషన్ విద్యను అందిస్తున్నాయి. ఐటీఐలో చేరే విద్యార్థులకు ఆయా శిక్షణా సంస్థలు వివిధ ట్రేడులు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా), ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మెకానిక్(మోటార్ మెకానిక్), మెకానిక్ డీజిల్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, టర్నర్, వెల్డర్, శానిటరీ ఇన్స్పెక్టర్, తదితర కోర్సులను ఆయా ఐటీఐల ద్వారా విద్యార్థులకు అందిస్తున్నాయి. ఒక్కో ట్రేడును పూర్తి చేసేందుకు కొన్ని రెండేళ్లు, మరికొన్ని సంవత్సరం లోపు పూర్తి చేసే అవకాశం ఉంది.
ఐటీఐతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఐటీఐ 31ఏళ్లుగా నడిపిస్తున్నం. నాన్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అందిస్తున్నం. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నరు. శిక్షణ తర్వాత స్కిల్స్ ఉన్నవారికి ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ఎంఎన్సీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఐటీఐ తర్వాత ఉన్నత విద్య కూడా చదువచ్చు.
– ముష్కె వీరరాజు, జీఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్(జమ్మికుంట)