Weather Update | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ హైదరాబాద్ విభాగం చల్లటి ముచ్చట చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలలో వానలు పడతాయని ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. వివిధ జిల్లాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసినా.. హైదరాబాద్లో మాత్రం కురిసే అవకాశం లేదని స్పష్టంచేసింది. 7, 8 తేదీల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలిపింది.
తెలంగాణలో వచ్చే రెండు రోజులు వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు సైతం రెండు, మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొన్నది. రాష్ట్రంలో ఎండలు 43 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని, ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. 7వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిపింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆదివారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని పేర్కొంటూ.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. శుక్రవారం నల్లగొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వివరించింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. హైదరాబాద్లోని పలు దవాఖానల్లో అక్యూట్ డయేరియా డిసీజ్ (ఏడీడీ), వాంతులు, డీ హైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయి. వేసవిలో వడగాడ్పులు వీస్తున్నందున పిల్లలు జ్వరం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కండ్లు మండటం, తలనొప్పి, తల తిరగడం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు, విరేచనాలు వచ్చినప్పుడు పిల్లలను చల్లని ప్రదేశాల్లో ఉంచాలని వైద్యులు సూచించారు. కొబ్బరి నీరు లేదా ఓఆర్ఎస్ వంటివి ఇవ్వాలని తెలిపారు. వేసవి కాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతూ నీడ పట్టున ఉంటే మంచిదని పేర్కొన్నారు.