హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలువాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలపై ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్న వేళ.. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన ఆర్థికబలం నిరూపించుకునేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, లాంకోహిల్స్, రాయదుర్గం, బషీర్బాగ్ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో పొంగులేటికి చెందిన కంపెనీలు, బంధువుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హైదరాబాద్లో 8 చోట్ల, ఖమ్మంలోని 21 ప్రదేశాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. బెంగళూరు, చెన్నైకి చెందిన మొత్తం 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది.
ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోనివ్వని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మొదటి నుంచి బీరాలు పలుకుతున్నారు. తన డబ్బుతోపాటు టికెట్లు అమ్ముకొని పీసీసీ అధ్యక్షుడు అక్రమంగా సంపాదించిన డబ్బును కూడా ఉమ్మడి ఖమ్మంలో భారీగా పంచుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వైపు గాలి వీస్తుండటంతో డబ్బులు పంచి గెలువాలని కాంగ్రెస్ నేతలు చూస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఖమ్మం చేరుకున్న డబ్బులో పీసీసీ అధ్యక్షుడి సోదరుల పాత్ర ఉన్నట్టు టికెట్లు ఆశించి భంగపడిన బహిష్కృత నేతలు ఆరోపిస్తున్నారు. ఐటీ సిబ్బందిలోని కొందరు కోవర్టుల ద్వారా సోదాల విషయాన్ని ముందుగానే తెలుసుకున్న పొంగులేటి.. అప్రమత్తమైనట్టు తెలిసింది. అక్రమంగా సంపాదించిన డబ్బు తనిఖీల్లో పట్టుబడకుండా ముందే సర్దేసినట్టు తెలుస్తున్నది. అక్రమ డబ్బునంతా తరలించిన తర్వాత.. తనపై ఐటీ, ఈడీ సోదాలు జరుగుతాయని సభల్లో చెప్పాడని, అతను చెప్పిన 17 గంటల్లోపే ఐటీ సోదాలు జరిగాయని, ఇదంతా ఆయన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందని ఖమ్మానికి చెందిన కొందరు నేతలు చెప్తున్నారు.