దుబ్బాక, జూన్ 14: ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నా ఇంటిపై ఐటీ దాడులు చేయించింది. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కొత్త ప్రభాకర్రెడ్డి ఈజ్ ఫ్యూర్ వైట్ పేపర్’ అని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో ప్రభాకర్రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఐటీ సోదాలపై ఎంపీ ప్రభాకర్రెడ్డి దుబ్బాక నుంచి స్పందించారు. ఐటీ అధికారులు తనకు ఫోన్ చేసి.. హైదరాబాద్లో తమ ఇంట్లో సోదాలు చేసేందుకు సెర్చ్ వారెంట్తో వచ్చామని చెప్పినట్టు తెలిపారు.
తాను హైదరాబాద్లో లేకున్నా.. తమ కుటుంబసభ్యులు ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించారని చెప్పారు. తాను 1986 నుంచి వ్యాపారం చేస్తున్నానని, అప్పటి నుంచే పాన్కార్డు తీసుకున్నానని తెలిపారు. తమకు అక్రమ వ్యాపారాలు లేవని, చేసేది ఒకే ఒక్క ట్రాన్సుపోర్టు వ్యాపారమని, అందులో అవినీతి, అక్రమాలకు తావు లేదని, తమ లావాదేవీలు పూర్తిగా వైట్ అని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని వివరించారు. తన ఇంట్లో ఐటీ రైడ్స్ చేసిన అధికారులకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని పేర్కొన్నారు. తనతో ఫోన్లో ఐటీ అధికారులు మాట్లాడింది ఒకటైతే.. టీవీ చానళ్లలో మరొక విధంగా ప్రసారం కావడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నాయకులపై బురద జల్లేందుకే ఐటీ సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.