మిర్యాలగూడ, నవంబర్ 16 : అసెంబ్లీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ ఇంజమూరి శ్రీధర్ ఇంటితోపాటు రైస్ మిల్లు యజమానులు రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య, రేపాల అంతయ్య ఇం డ్లు, మిల్లుల్లో గురువారం ఉదయం 4 నుంచి అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. త్రిపురారం మండలం ముకుందాపురంలోని వెంకటసాయి సాల్వెంట్ ఆయిల్ మిల్లులోనూ సోదాలు చేపట్టినట్టు సమాచారం. 40 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తున్నది.
దాడులు జరగలేదు: ఎమ్మెల్యే భాస్కర్రావు
తన ఇంట్లో ఐఈ దాడులు జరుగుతున్నాయని కొన్ని టీవీ ఛానళ్లు అసత్య ప్రచారం చేయడం సరికాదని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పేర్కొన్నారు. తనకు దేశంలోని పలు పవర్ ప్లాంట్లలో వాటాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని, వాటిని నిరూపిస్తే ఆయా ఛానళ్ల వారికే రాసి ఇస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు కొందరు కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
హాలియాలోనూ సోదాలు
హాలియా: నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి నివాసంతోపాటు ఆయన డైరెక్టర్గా ఉన్న హాలియా పట్టణ పరిధిలోని పాలెం స్టేజీ వద్దనున్న వజ్రతేజ రైస్ మిల్లులో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. రాత్రిపొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఐటీ దాడులకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.