Minister KTR | మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మారిందో ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆనాడు పాలమూరంటే మైగ్రేషన్, నేడు పాలమూరంటే ఇరిగేషన్ అని పేర్కొన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి ఐటీ టవర్, శిల్పారామంతోపాటు వివిధ జంక్షన్లను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం బాయ్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ‘ఇవాళ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాం.. జీవం లేని పాలమూరుకు గోదావరి, కృష్ణా నదులతో జీవం పోసినం. పాలమూరు పచ్చబడుతుంటే కొందరి కండ్లు మండుతున్నాయి. కడుపు మండుతున్నది. వలస కూలీలకు పేరుపడ్డ పాలమూరు నుంచి గతంలో ఏటా 14-15 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసపోయేవారు. నేడు తిరిగి పాలమూరుకే ఇతర రాష్ర్టాల కూలీలు వలస వస్తున్నారు. ఇదంతా కొందరికి నచ్చుతలేదు.. తిన్నది అరుగతలేదు.. నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజలను రెచ్చగొడుతున్నారు. నాడు పల్లేర్లు మొలిచిన పాలమూరులో ఈ రోజు పసిడి పంటలు కనపడ్తున్నాయా? లేదా? ఇది పాలమూరు సాధించిన ప్రగతి కాదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ ఎంత బాగుందో చెప్పడానికి పాలమూరే మచ్చుతునక అని పేర్కొన్నారు. ఒకనాటి వలస బతుకుల గడ్డ.. నేడు పరిశ్రమల అడ్డాగా మారిందని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో దశాబ్దాలపాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నేడు జెట్ స్పీడ్తో సిద్ధమవుతూ రన్నింగ్లో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘నాడు జూనియర్ కాలేజీ కావాలంటే వందల అప్లికేషన్లు ఇచ్చినా పట్టించుకొనేవారే లేరు.. ఇవాళ అడగకముందే మెడికల్, జూనియర్ కాలేజీలు ఇస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు తెలంగాణ కోసం గట్టిగా మాట్లాడినా ఏదో ఓ పథకం పేరు చెప్పి మాయచేసి ఓట్లు వేయించుకొనేవాళ్లు.. తెలంగాణ వచ్చినంక పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. చెరువులను బాగు చేసుకున్నాం.. దివిటిపల్లికి అటు పక్క కరివెన, ఇటువైపు ఉద్ధండాపూర్ రిజర్వాయర్లలో 33 టీఎంసీల నీటిని ఆగస్టులో నింపుతాం. ఈ ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తయ్యాయి. సీఎంకు పాలమూరు అంటే ఎంత ప్రేమో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కులపిచ్చి, మత పిచ్చిగాళ్లను పట్టించుకోవద్దు. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం.. జనహితమే మన అభిమతం. కేసీఆర్ ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారు’ అని చెప్పారు.
సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నోటికి వచ్చినట్టు బూతులు, అడ్డగోలుగా మాటలు.. సీఎం కేసీఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వటంలేదు. తెలంగాణ తెచ్చిన సీఎం, రెండుసార్లు ప్రజలచేత ఎన్నుకోబడిన మహానేత వయసుకు, స్థాయికి గౌరవం ఇవ్వాలన్న సంస్కారం లేని నీచుడు రేవంత్రెడ్డి. రెండుమూడు రోజలు కింద పాలమూరుకు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వండి అన్నడు. దేశాన్ని 55 ఏండ్లు కాంగ్రెసోళ్లే పరిపాలించారు. ఒక్కచాన్స్ కాదు.. 11 చాన్స్లు ఇచ్చాం. తెలంగాణ రాక ముందు 11 సార్లు అధికారం అప్పగించినం. ఏం చేశారు? పెన్షన్లు లేవు, సాగునీరు లేదు, పరిశ్రమలు లేవు, కడుపు చేతపట్టుకొని ముంబైకి, దుబాయికి వలసపోయే దుస్థితి తెచ్చారు. అట్లాంటి పాలమూరును కష్టపడి బాగుచేస్తే ఇప్పుడు మళ్లీ చాన్స్ ఇవ్వమంటున్నాడు’ అని ధ్వజమెత్తారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చోడో, మంచోడో తెలియటం లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఈ జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ‘జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోసం చేసిన మోదీ ఒక దిక్కు.. 15 లక్షల మంది పిల్లలు మహబూబ్నగర్ నుంచి వలసపోకుండా ఆపిన కేసీఆర్ మరో దిక్కు.. మీరు ఏ దిక్కున ఉంటారో తేల్చుకోండి. ఇదే మైదానంలో పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి ఇచ్చిండా? కనీసం కృష్ణా నదిలో మన వాటా తేల్చిండా? రూ.400 ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200 చేసిన బీజేపీని బండకేసి కొట్టాల్నా లేదా? జాడిచ్చి తన్నాల్నా లేదా? బీజేపీలో అరుణమ్మ, జితేందర్రెడ్డి తిరుగుతన్నారు. బండి సంజయ్ అనే పిచ్చోడు కూడా తిరుగుతున్నాడు. నోరు తెరిస్తే మోదీ దేవుడు అంటాడు.. ఎందుకు దేవుడు? పెట్రోల్ ధర పెంచినందుకా? వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకా?’ అని ప్రశ్నించారు. ఎగవేతదారులకు సద్దులు గట్టి దోచిపెడుతున్న మోదీ కావాలో.. 14 లక్షల పేదింటి ఆడపిల్లలకు పెండ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ను కడుపులో పెట్టుకొని చూసుకొనే బాధ్యత పాలమూరు ప్రజలదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడిచ్చిన మెజార్టీకి మరో 30 వేల మెజార్టీ ఇచ్చి శ్రీనివాస్గౌడ్ను గెలిపించాలని కోరారు.
తెలంగాణ, పాలమూరు ప్రగతిని చూసి ఓర్వలేక ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తూ రాష్ర్టానికి సీఎం అవుతామని కొందరు కలలు కంటున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. ఒకడు మతం అడ్డం పెట్టుకుని రాజకీయంచేస్తే.. మరొకడు బ్లాక్మెయిల్ చేసి సంపన్నుడిలా ఫీల్ అవుతున్నాడని విమర్శించారు. నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రాంరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్ ఇషాక్, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు ఐటీ కారిడార్లోకి కంపెనీల రాక మొదలైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. శనివారం ఐటీ టవర్ను మంత్రులు ప్రారంభించిన అనంతరం అమరరాజా బ్యాటరీ కంపెనీతోపాటు మరో ఎనిమిది కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకొన్నారు. ముల్లార్. కనెక్ట్, అమరరాజా గ్రూప్, జువేన్ టెక్నాలజీస్, ఇంటూట్స్ ఎల్ఎల్సీ, ఉర్పాన్ టెక్నాలజీస్, ఈ-గ్రోవ్ సిస్టమ్స్, ఐటీ విజన్ 360 ఇంక్, ఫోన్ఓక్స్ ఇంక్, బీసీడీసీ క్లౌడ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ కొలువు దీరనున్నాయి. మహబూబ్నగర్ ఐటీ టవర్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు అంతస్థుల్లో నిర్మించినట్టు మంత్రి చెప్పారు. ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో వరంగల్, కరీంనగర్, ఖమ్మంతోపాటు మహబూబ్నగర్లో టవర్లను ప్రారంభించగా, నిజామాబాద్, నల్లగొండ, సిద్దిపేటల్లో త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు.