హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు తరాల కోసం దేశంలో తొలిసారిగా కూల్ రూఫ్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని, మున్ముందు ఈ విధానం దేశానికే ఆదర్శంగా మారనున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఇది ఓట్లు, సీట్ల కోసం తెచ్చిన పాలసీ కాదని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రభుత్వ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని చెప్పారు. సోమవారం హైదరాబాద్లోని సీడీఎంఏ కార్యాలయంలో తెలంగాణ కూల్రూఫ్ పాలసీ 2023-28కి సంబంధించిన విధాన పత్రాన్ని మంత్రి కే తారక రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ తరహా పాలసీ దేశంలోనే తొలిసారి అని చెప్పారు. ‘ఒకరోజు కోసమో, ఒక నెల కోసమో కూల్రూఫ్ పాలసీని తీసుకురాలేదు. ఓట్లు, సీట్ల కోసమో, రాజకీయాల కోసమో ఈ విధానాన్ని తేవడం లేదు. భవిష్యత్తు తరాలు బాగుండాలనే సద్దుదేశంతోనే ఈ పాలసీని తీసుకువచ్చాం. ఇది రాష్ర్టానికి, దేశానికి ఉపయోగపడే మంచి కార్యక్రమం’ అని కేటీఆర్ వివరించారు. వేసవిలోనే ఈ పాలసీని తీసుకురావడం ద్వారా మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకపోతున్నదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వస్తే భూములు, నిర్మాణ రంగం దెబ్బతింటాయని ప్రచారం చేశారని.. ఒక్క సంవత్సరం ఆగండి, ఆ తరువాత 7-8 ఏండ్లపాటు హైదరాబాద్ నిర్మాణ రంగంలో దూసుకపోతుందని 2014లోనే తాను చెప్పానని గుర్తుచేశారు. దేశంలో కార్యాలయ స్థలం (ఆఫీస్ స్పేస్) కొనుగోలు హైదరాబాద్లో అత్యధికంగా జరుగుతున్నదని తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆఫీసు స్థలాలకు డిమాండ్ తగ్గినా.. తెలంగాణాలో మాత్రం డిమాండ్ తగ్గలేదని చెప్పారు. ఆఫీస్ స్పేస్ కొనుగోలులోనే కాదు.. ఉద్యోగాల కల్పనలోనూ హైదరాబాద్ బెంగుళూరును దాటేసిందన్నారు. 2022లో దేశీయ ఐటీరంగంలో 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే.. హైదరాబాద్లో 1.50 లక్షలు, బెంగళూరులో 1.46 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ విజయప్రస్థానం ఇప్పుడే మొదలైందని, భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో మూడో అతి పెద్ద అర్బన్ జనాభా ఉన్న రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో గత 5 వేల ఏండ్లలో ఎంత
పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏండ్లలో అంత పట్టణీకరణ జరుగనున్నది. అందుకే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూల్రూఫ్ పాలసీ తెచ్చాం. న్యూయార్క్ నగరం 0.1 చదరపు కిలోమీటర్లు మాత్రమే కూల్ రూఫింగ్ లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ తెలంగాణ అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమైంది. ఏకంగా 2028 నాటికి 300 చదరపు కిలోమీటర్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
– మంత్రి కేటీఆర్
తెలంగాణలో ఉన్న ప్రజాస్వామిక, పారదర్శక ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. చన్నై, బెంగుళూరు, ముంబైలలో ఒక భవన నిర్మాణానికి అనుమతి రావాలంటే చదరపు మీటర్కు ఇంత రేటు అనే అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. కానీ ఇక్కడ అలాంటి ఆరోపణలేవీ లేవని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రోగ్రెసివ్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నదని, టీఎస్బీపాస్ లాంటి విధానాలు ఇక్కడ అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రూపొందించిన విధానాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)ని అడాప్ట్ చేసుకున్న మొదటి రాష్ట్రం కూడా తెలంగాణనే అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 240 కోట్ల మొక్కలను నాటామని, మొక్కలు నాటడం, వాటిని బతికించడం తప్పనిసరి చేస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో పేర్కొన్నామని కేటీఆర్ వివరించారు.
‘దేశంలో మూడో అతి పెద్ద అర్బన్ జనాభా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ప్రపంచంలో గత 5 వేల ఏండ్లలో ఎంత పట్టణీకరణ జరిగిందో.. రాబోయే 50 ఏండ్లలో అంత పట్టణీకరణ జరుగనుంది’ అని మంత్రి కేటీఆర్ వివరించారు. పట్టణీకరణ నేపథ్యంలో కూల్రూఫ్ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని, తెలంగాణ తీసుకువచ్చిన కొత్త విధానం దేశానికి ఒక మార్గదర్శిగా నిలవబోతుందని అన్నారు. కూల్ రూఫ్ కోసం చదరపు మీటరు రూ.300 వరకు ఖర్చు అవుతుందని నిపుణులు లెక్కలు వేశారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రూఫ్ చల్లబడటంతోపాటు గోడలు కూడా చల్లగా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వాడవచ్చనే దానిపై అధ్యయనం జరుగాలని ఆయన సూచించారు. వేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో వేడి వచ్చే మెటీరియల్ను వాడుతున్నారని, భారీ నిర్మాణాలకు కూల్రూఫ్ పాలసీ తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్కు కూల్ రూఫ్ పాలసీ అమలు తప్పనిసరి అని తెలిపారు. 600 గజాల పైన నిర్మాణం చేసే భవనాలకు తప్పనిసరి అని ఆయన తెలిపారు. కూల్ రూఫింగ్ చేయిస్తే దానికి అయ్యే వ్యయం.. రెండేండ్లలో తిరిగి వస్తుందని, ఇల్లు చల్లగా ఉండటం ద్వారా విద్యుత్తు వాడకం తగ్గి ఆ మేరకు పెట్టిన పెట్టుబడి మొత్తం సర్దుబాటు అవుతుందని కేటీఆర్ వివరించారు. 600 గజాల లోపు వారు కూడా దీనిని అమలు చేస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కూల్రూఫింగ్పై మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటికే నిర్మించిన ఇండ్లకు రెట్రో ఫిట్టింగ్ చేయవచ్చని కేటీఆర్ సూచించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పెట్టి, చర్చించి కార్పొరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిని కోరారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీలకూ అవగాహన కల్పించాలని, ప్రోత్సాహకాలు ఇచ్చేలా ఆలోచించాలని సూచించారు. త్వరలో ‘మన నగరం’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నామని, గతంలో నిర్వహించినట్టు టౌన్హాల్ సమావేశాలనూ ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మిద్దె తోటలు, రూఫ్టాప్ కిచెన్ల ఏర్పాటుపై ప్రజలను ప్రోత్సహించేలా ఒక విధానం రూపొందించాలని మున్సిపల్శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
కూల్ రూఫింగ్ పాలసీ అత్యంత ముఖ్యమైన విధానమని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పాలసీని తెచ్చామని మంత్రి కేటీఆర్ అన్నారు. న్యూయార్క్ నగరంలో 10 లక్షల చదరపు ఫీట్లు (0.1 చదరపు కిలోమీటర్లు) మాత్రమే కూల్ రూఫింగ్ చేస్తున్నారని కానీ తెలంగాణ అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని సాధించేందుకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 7.5 చదరపు కిలోమీటర్లు సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని వెల్లడించారు. రాబోయే ఐదేండ్లలో హైదరాబాద్లో 200 చదరపు కిలోమీటర్లు , ఇతర ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్లు కూల్రూఫింగ్ను లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఔటర్ రింగ్రోడ్ లోపల 1000 చదరపు కిలోమీటర్లు ఉంటుందని, దీనిలో 20 శాతం కూల్ రూఫింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
చాలామంది వాస్తును మూఢనమ్మకం లాగా చూస్తారు కానీ, అది కూడా ఒక శాస్త్రీయ విధానమేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఎటువైపు వంటగది, పడకగది ఉండాలనే దానిపై పెద్దలు చెప్పే మాటల్లో గాలి, వెలుతురు ధారాళంగా రావాలన్న శాస్త్రీయమైన ఆలోచన కూడా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. కూల్రూఫ్ పాలసీ లాంటి మంచి పాలసీని తీసుకువచ్చిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఆయన బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎంపీ బీ వెంకటేశ్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీష్రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, ఐఐఐటీ ప్రొఫెసర్ విశాల్ గార్గ్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ఎన్ఆర్డీసీ ప్రతినిధి నీతూజైన్ తదితరులు పాల్గొన్నారు.
కూల్ రూఫింగ్ విధానంలో ప్రభుత్వం, బిల్డర్లు, ఇంటి యజమానులకు బాధ్యత ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టే 10 కోట్ల చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని కూడా పెయింట్ వేసి కూల్ రూఫింగ్ కిందికి తీసుకురావాలనేదే లక్ష్యమని చెప్పారు. డబుల్ బెడ్రూంతోపాటు ప్రభుత్వం నిర్మించే అన్ని భవనాలనూ కూల్ రూఫింగ్ కిందికి తీసుకువచ్చే బాధ్యత తమపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో 500 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి చెప్పారు. డీకార్బనైజేషన్ జరగాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని, ఇది జరిగితే సమాజానికి మేలు జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పాలసీని తీసుకురావడం సులభమేనని.. కానీ ఇది ఆచరణలో పెట్టడమే క్లిష్టమైన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతరులకు చెప్పే ముందు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో తమ ఇంటిని రూఫ్ టాప్పై కూలింగ్ కోసం పెయింట్ వేయించానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.