హైదరాబాద్ : డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదలకు సీఎం కేసీఆర్ ఇస్తున్న కానుక అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘కోరుట్లపేట గ్రామంలో డబుల్ బెడ్రూంలో గృహ ప్రవేశం చేసిన అన్నదమ్ములకు, అక్కా చెల్లెల్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మూడు ఇండ్లలో లాంఛనంగా వారికి ఇండ్లు అందజేసి, గృహ ప్రవేశం చేయించాం.
లాంఛనంగా గృహప్రవేశం చేయించే సందర్భంగా ముగ్గురిని ఒకటే అడిగిన. మీరు ఎక్కడ ఉండేది అని అడిగిన?. ఇక్కడే గుడిసెలో ఉండేవాళ్లమని చెప్పారు. మరి ఇదే ఇల్లుగనక మీరు కట్టి ఉంటే ఎంత ఖర్చయ్యేదని అడిగిన.. రూ.8లక్షల నుంచి రూ.10లక్షలు ఖర్చవుతుండే, కానీ ప్రభుత్వమే మాకు నిర్మించి ఇచ్చిందని చెప్పారు. ఒక్క రూపాయి గానీ, ఒక పైసా గానీ ఎవరికైనా లంచం ఇచ్చారా?.. మీ సర్పంచో.. ఉప సర్పంచో.. వార్డు మెంబరో.. ఎంపీటీసీ ఎవరికైనా పైసా లంచం ఇవ్వాల్సి వచ్చిందా? అని అడిగిన. ఒక్క పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం పడలేదు.
మమ్మల్ని వెతికి.. ఇల్లు లేదని గుర్తించి.. అర్హత ఉందని భావించి డబుల్ బెడ్రూం ఇచ్చారు.. సంతోషం అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.20వేలకోట్లతో ప్రభుత్వం బ్రహ్మాండంగా 2.70లక్షల ఇండ్లు నాణ్యంగా నిర్మించి పేదలకు అందజేస్తున్నది. ఇలాంటి కార్యక్రమం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేదు. కేవలం తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే ఉన్నది. కావాలంటే దేశంలో ఎక్కడైనా చూడొచ్చు. ఏ రాష్ట్రమైనా పోవచ్చు.. అక్కడ మీకు చుట్టాలున్నా.. అక్కడ మీకు దోస్తులున్నా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రెండు బెడ్రూంలు, రెండు టాయిలెట్లు, ఒక హాలు, ఒక కిచెన్.. భారతదేశంలో ఇంత నాణ్యత ఇండ్లు కడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదు.
500 చదరపు అడుగుల్లో ఇంత బ్రహ్మాండంగా పేదవారికి రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు. మేం ఏం కోరుతున్నమంటే.. ఇంత నాణ్యమైన ఇండ్లను చేతిలో పెట్టినప్పుడు.. చుట్టుపక్కల పరిశుభ్రత పాటించండి. మొక్కలు నాటండి. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండ్లను కాపాడుకోవాలని చెబుతున్నాం. ఈ ఇండ్లు మీకు కేసీఆర్ ఇస్తున్న కానుక. దీన్ని మీరు పిల్లలకు ఇచ్చుకునే విధంగా బ్రహ్మాండంగా మేయింటెన్ చేయాలని కోరుతున్నాం. గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాలు తెలుసు. పల్లె ప్రగతిలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా చెట్లు, మిషన్ భగీరథలో భాగంగా మంచినీళ్లు, మంచినీళ్ల ట్యాంకులు, రైతులు వేదికలు, వైకుంఠధామాలు, నర్సరీలు ఇవన్నీ దేశంలో ఒక తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు. 24 గంటల కరెంటు వస్తున్నది, రైతుబంధు ద్వారా 50వేలకోట్ల రూపాయాల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
రైతుబీమా ద్వారా రైతు కుటుంబానికి ఏమైనా అయితే రూ.5లక్షలు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని ఎన్నో కార్యక్రమాలు మన కోసం చేస్తున్న కార్యక్రమాలు. దయచేసి నేను కోరుకునేది మంచి కార్యక్రమాల్ని వాడుకోండి.. వినియోగించుకోండి. కొత్త పెన్షన్లు త్వరలోనే వస్తాయ్.. ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. ఇచ్చిన ఆస్తిని సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా మోహన్ అనే వ్యక్తి మృతి చెందగా.. సెస్ తరఫున మంజూరైన రూ.5లక్షల బీమా చెక్కును మృతుడి భార్య పద్మకు మంత్రి అందజేశారు.