హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గతం కంటే పల్లెలు బాగు పడ్డాయో లేదో సభ్యులు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలని కేసీఆర్ కోరారు. గ్రామాలు మంచి రూపం తీసుకుంటున్నాయన్నారు. గురువారం అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. ‘నేను చేతులెత్తి వారికి మొక్కుతున్న. వారి కృషితోనే పల్లెల్లో ప్రగతి సాధ్యమవుతున్నది. పాజిటివ్ డైరెక్షన్లో పని జరుగుతున్నది. గిరిజన బిడ్డలు మంచిగా పనిచేసుకుంటున్నరు. ఆదిలాబాద్లో అంటు, విషరోగాలు పోయినయి. కమ్యూనికబుల్ డిసీజెస్ భగీరథతో తగ్గినయి. ఒక మంచిని మంచి అంటే చేసేవాళ్లకు ఉత్సాహం వస్తది. ఇంకా మంచి జరుగుతది. పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నరు. చక్కటి ఫలితాలు వస్తున్నయి. ఇంకా జరుగాలె’ అన్నారు.
దుఃఖ పెట్టింది గత ప్రభుత్వాలే
‘సర్పంచ్లను దుఃఖపెట్టింది గత ప్రభుత్వాలే. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వాళ్లు ఇచ్చిన గౌరవ వేతనాలు చూస్తే వాళ్లను ఏ విధంగా బాధ పెట్టారో తెలుస్తుంది. ఇప్పుడు వారి జీతాలను, గౌరవాన్ని పెంచినం. గ్రామకార్యదర్శుల వేతనాలను కూడా గణనీయంగా పెంచింది. జడ్పీ చైర్మన్లకు కొత్త కార్లు ఇచ్చి, సౌకర్యాలు కల్పించి, జీతం కూడా పెంచినం. దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాలతో పోలిస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు తెలంగాణలోనే ఎకువగా ఉన్నాయి.
సఫాయన్నా.. నీకు సలాం అని చెప్పిన
గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన తలసరి నిధులు రూ.4 మాత్రమే. అదే తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వ్యక్తికి రూ.669 చొప్పున ఇస్తున్నది. జీహెచ్ఎంసీలో సఫాయి కార్మికులకు గతంలో రూ. 8,500 ఇస్తే మేము రూ. 17 వేలిస్తు న్నాం. సర్పంచ్ల కన్నా, ఎంపీటీసీల కన్నా వీరికి జీతం ఎక్కువ. నేను ఓ దశలో ‘సఫాయన్నా.. నీకు సలాం’ అని అన్నా. మన తల్లిదండ్రుల కన్నా గొప్పోల్లు.. వాళ్లను గౌరవించాలే అని చెప్పిన. చిన్నప్పుడు మనల్ని తల్లిదండ్రులు శుభ్రం చేసి ఎలా పెంచారో, వీళ్లు కూడా మనం పారేసే చెత్త, చెదారాన్ని తీసేసి, గ్రామాలను, పట్టణాలను శుభ్రంగా ఉంచుతున్నరు.. వాళ్లకు దండం పెట్టాలే. కొంచెం భారమైనా దేశంలో నెం.1 శాలరీ నా ప్రభుత్వ ఉద్యోగులకే దొరుకుతుంది. మొన్న కూడా 30% పీఆర్సీ ఇచ్చినా. అనుబంధంగా ఉండే చిన్న ఉద్యోగులకూ పీఆర్సీ ఇచ్చినం.