కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వదు. రాష్ట్రాలు తమ వాటాను భరించాలి. అయినప్పటికీ కేంద్రం పెత్తందారీతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్ని అడ్డంపెట్టుకొని ఎన్ఈపీని బలవంతంగా రుద్దేందుకు పన్నాగాలు పన్నుతున్నది. ఎన్ఈపీని అమలుచేస్తేనే పీఎంశ్రీ స్కూళ్లను మంజూరుచేస్తామని షరతులు పెడుతున్నది. ఇందుకు కేంద్రంతో రాష్ట్రాలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ పాఠశాలలను బాగు చేస్తామంటూ పీఎంశ్రీ పథకాన్ని ప్రకటించిన కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఎన్ఈపీని కేరళ, తమిళనాడుతోపాటు మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ సైతం పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. వ్యతిరేకించే రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని వాడుకొంటున్నదనే విమర్శలున్నాయి. మోటర్లకు మీటర్లు పెడితే 0.5% ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచుతామన్న కేంద్రం.. తాజాగా అదే తరహాలో పీఎంశ్రీ స్కూల్స్ పథకంపైనా షరతులు విధించడం గమనార్హం.
పీఎంశ్రీ పథకానికి కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వదు. రాష్ట్రాలు తమ వాటాను భరించాలి. అయినప్పటికీ కేంద్రం పెత్తందారీతనం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 స్కూళ్లను ఎంపికచేస్తారు. రాబోయే ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.27,360 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం వాటా రూ.18,128 కోట్లు. మిగిలిన రూ.9,232 వేల కోట్లు రాష్ర్టాలే భరించాలి. స్కూళ్ల ఎంపికను కేంద్రమే చేపడుతుంది.
పీఎంశ్రీ పథకానికి దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్నది. ఆన్లైన్ పోర్టల్లో స్కూళ్లు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. మొదటి రెండేండ్లలో మూడు నెలలకొకసారి చొప్పున సంవత్సరానికి నాలుగుసార్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ స్కూళ్లు పోటీపడొచ్చు. మండలానికి ఒక ప్రాథమిక, ఒక సెకండరీ/ సీనియర్ సెకండరీ పాఠశాల చొప్పున రెండు స్కూళ్లను ఎంపికచేస్తారు. ఎంపిక, పర్యవేక్షణ కోసం పాఠశాలను జియోట్యాగింగ్ చేస్తారు. జియోట్యాగింగ్ కోసం భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్పేటిక్స్ సేవలను వినియోగించుకొంటారు. ఈ పథకంలో భాగంగా స్కూళ్లను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్ రహిత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.