హైదరాబాద్, జనవరి8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం అవాస్తవమని వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న అంశాన్ని సోమవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై ఆ శాఖ సంచాలకులు స్పందించారు. రైతులు యూరియా, ఎరువుల కొరతపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, అవసరానికి సరిపడా సరఫరా చేస్తున్నామని తెలిపారు.
యాసంగి సీజన్కు గాను 19.24 లక్షల మెట్రిక్ టన్నుల మేర అన్నిరకాల ఎరువుల ప్రణాళికను సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. నిరుడు ఇదే రోజు నాటికి 7.01 లక్షల మెట్రిక్ టన్నుల మేర అన్నిరకాల ఎరువులు నిల్వ ఉండగా, ఈ యాసంగి సీజన్కు గాను 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వ ఉంచామని, ఇది నిరుటితో పోలిస్తే 28 శాతం అధికమని ఆ శాఖ పేర్కొన్నది.