హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మహిళా విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజీలివ్వడం సాధ్యంకాదని ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. ఇప్పుడున్న కాలేజీలతోనే వర్సిటీని నడపాలని సూచించింది. వర్సిటీ విభజన పూర్తికాలేదు.. ఫ్యాకల్టీ లేరు.. వసతుల్లేవు ఈ తరుణంలో అఫిలియేటెడ్ కాలేజీలను బదలాయించలేమని ఉన్నత విద్యామండలి స్పష్టంచేసింది. రాష్ట్రంలోని మహిళా కాలేజీలు, విద్యాసంస్థలను మహిళా వర్సిటీకి బదలాయించాలని మహిళా వర్సిటీ ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యామండలి ఓ నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని అఫిలియేటెడ్ కాలేజీలను కేటాయించడం సాధ్యంకాదని తేల్చింది.
గత ప్రతిపాదనలకు పాతర..
మహిళా యూనివర్సిటీని గత కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ వుమెన్ యూనివర్సిటీగా నామకరణం చేసింది. రాష్ట్రంలో మహిళా డిగ్రీ, పీజీ సహా ప్రొఫెషనల్ కాలేజీలను ఈ వర్సిటీ పరిధిలోకి తేవాలని భావించింది. ముఖ్యంగా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ, పీజీ కాలేజీలు ఈ వర్సిటీ పరిధిలో పనిచేయాలన్న ఆలోచన చేసింది. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ ప్రతిపాదనలకు పాతరేసింది. అధికారంలోకి వచ్చాక, తెలంగాణ స్థానంలో వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా పేరుమార్చింది. యూనివర్సిటీ యాక్ట్ను అసెంబ్లీలో పాస్ చేయించింది. ఇంత వరకు వర్సిటీ విభజన పూర్తికాలేదు. దీనిపై ఓ కమిటీని వేశారు. ఫ్యాకల్టీ, ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని కమిటీ సూచించింది. అప్పటి నుంచి ఇంత వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు.