హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డిపాజిట్ కోసం చెక్కులను బ్యాంకులు, ఏటీఎంలలోని డ్రాప్బాక్స్లలో వేస్తుంటాం. అయితే, వాటిల్లోంచి చెక్కులు కొట్టేసి డబ్బులు కాజేస్తున్నారు కొందరు కిలాడీ దొంగలు. ఇటీవల ఇలాంటి కేసులు హైదరాబాద్లో పది వరకు నమోదయ్యాయి. డ్రాప్బాక్స్లపై బ్యాంకుల నిఘా సరిగా లేకపోవటమే దొంగలకు కలిసి వస్తున్నట్టు తెలుస్తున్నది. డ్రాప్బాక్స్లలో వేసిన చెక్కులు కాజేసి, ఆ చెక్కును పరిశీలించి, అందులో ఉండే పేరుకు తగ్గట్టు ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరుస్తున్నారు. అందుకోసం నకిలీ ఐడీ ప్రూఫ్లు వాడుతున్నారు. చెక్కులను కొత్త బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తున్నారు. డబ్బంతా డ్రా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చెక్కులపై ఉండే నంబర్లు మార్చి సొమ్ము కాజేస్తున్నారు. ఒకే రకం కేసులు ఎక్కువగా రావటంతో అప్రమత్తమైన పోలీసులు.. లోపాలపై ఆరా తీశారు. బ్యాంకుల ప్రతినిధులతో మాట్లాడి, చెక్కులు ఎలా దొంగిలిస్తున్నారు? ఎవరి నిర్లక్ష్యం ఉంటున్నది? అన్న వివరాలు సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా క్రైమ్స్ అదనపు సీపీ శిఖా గోయల్ మాట్లాడుతూ.. చెక్కుల జారీ విషయంలో ఖాతాదారులు, బ్యాంకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఖాతాదారులు చెక్కులు జారీ చేసే సమయంలో పేర్లు, అంకెలు రాసిన తర్వాత ఖాళీ స్థలాన్ని వదిలేయకుండా గీత గీయాలని చెప్పారు. చెక్కు ట్యాంపర్ కాకుండా జాగ్రత్తగా వాడాలని అన్నారు. బ్యాంకులు కూడా ట్యాంపర్ ప్రూఫ్ బాక్స్లు వాడాలని సూచించారు.