హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపితమైంది. చోరీకి గురైన, పోయిన ఫోన్లను గుర్తించి, వాటిని అసలైన యజమానులకు అందించడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంతో కేవలం రెండు నెలలోనే 2,288 ఫోన్లను యజమానులకు అప్పగించారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టేందుకు, పోయిన ఫోన్లను వెతికిపట్టుకునేందుకు టెలికం శాఖ రూపొందించిన సీఈఐఆర్ వ్యవస్థ తెలంగాణలో ఈ ఏడాది 19 నుంచి అందుబాటులోకి వచ్చింది. నాటి నుంచి జూన్ 19 వరకు చోరీకి గురైన/పోగొట్టుకున్న 34,200 ఫోన్లను బ్లాక్ చేసి, 5,970 ఫోన్లను ట్రేస్ చేశారు. వాటిలో 2,288 ఫోన్లను యజమానులకు అప్పగించారు. వీటిలో అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 300, వరంగల్ కమిషనరేట్ పరిధిలో 175, రాచకొండ పరిధిలో 148, కామారెడ్డి జిల్లాలో 131 ఫోన్లను అప్పగించారు. దీనిపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సీఈఐఆర్ను సమర్థంగా ఉపయోగించి, పౌరులకు విశేష సేవలందిస్తున్న సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్, సెక్యూరిటీ డీడీజీ కే రాజశేఖర్, సెక్యూరిటీ డైరెక్టర్ మురళీకృష్ణ, అడిషనల్ డైరెక్టర్ రాఘవరెడ్డి, సైబర్ క్రైమ్స్ ఎస్పీ (సీఐడీ) లావణ్య జాదవ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను డీజీపీ అంజనీకుమార్ అభినందించారు.
సీఈఐఆర్ను అమలు చేయడంలో తెలంగాణ కంటే మిగతా రాష్ట్రాలు ఎంతో వెనుకబడ్డాయి. ఉత్తరాది, ఈశాన్య రాష్ర్టాల్లో ఈ విధానం ఎప్పుడో అమల్లోకి వచ్చినా.. ఫోన్లను రికవరీ చేయడంలో ఆ రాష్ర్టాల పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. ఢిల్లీలో దాదాపు 3.5 లక్షలకుపైగా ఫోన్లు పోతే.. వాటిలో యజమానులకు అప్పగించినవి 1,270 మాత్రమే. సీఈఐఆర్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,81,404 ఫోన్లను బ్లాక్ చేయగా.. వాటిలో 2,63,445 మొబైల్స్ను ట్రేస్ చేశారు.