ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని మరోమారు రుజువైంది. సర్కారు బడుల్లో చదివే పిల్లలు దాదాపుగా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. వారికి బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటో తెలియదు. కాలేకడుపుతోనే పాఠాలు వింటున్న పిల్లలు ఎంతోమంది. కండ్లు నులుముకుని కూలికెళ్తే కానీ పొయ్యి వెలగని నిరుపేదలు అంత ఉదయాన్నే పిల్లల కడుపెలా నింపగలరు. భావిభారతావనికి చుక్కానిలా నిలవాల్సిన పిల్లలు ఇలా పస్తులతో పాఠాలు వినకూడదన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినదే ‘సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం’.
రోజుకో రుచికరమైన టిఫిన్.. అది కూడా బలవర్థకమైనది. ఓ రోజు ఇడ్లీ సాంబార్ అయితే, మరో రోజు పూరీ.. ఆలూకుర్మా. మరోరోజు మిల్లెట్ ఇడ్లీ.. ఇలా వారం రోజులు రోజుకో రకం అల్పాహారం అందించే పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇది పిల్లల కడుపునింపడమే కాదు.. పేదల మన్ననలు కూడా అందుకుంటున్నది. పిల్లలు తినకుండా బడికి వెళ్లారన్న రందిని తమ నుంచి దూరం చేసిన సీఎం కేసీఆర్కు తాము రుణపడి ఉంటామని తల్లిదండ్రులు వేనోళ్ల పొగుడుతున్నారు. ఇప్పటికే సర్కారు స్కూళ్లలో కార్పొరేట్ విద్యను అందిస్తున్న కేసీఆర్ సర్కార్ దేశంలోనే మరెక్కడా లేని ఈ అల్పాహార పథకం ప్రారంభించి ఆదర్శంగా నిలిచింది.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్
సర్కారు రంది లేకుండా చేసింది
నా బిడ్డలిద్దరూ సూర్జపూర్లోని సర్కారు బడిలో చదువుతున్నరు. మొదటి బిడ్డ స్నేహిత నాలుగు, అకాంక్ష రెండో తరగతి. రోజూ పొద్దుగాల టిఫిన్ చేసి పెట్టాలంటే ఇబ్బందయ్యేది. చాయలో బిస్కెట్లు తిని బడికి పోయేటోళ్లు. అప్పుడప్పుడు అటుకులు, ఉప్మా టిఫిన్గా చేసి పెడుతుంటిని. పిల్లలు ఆకలికి ఎట్లుంటరో అని రంది ఉండే. ఇప్పడు ఆ బెంగ పోయింది. ప్రభుత్వమే పొద్దున పిల్లలకు టిఫిన్ పెడతదని తెలిసింది. మేం పొద్దుగాల లేస్తనే కూలి పనులకు పోయేటోళ్లం. పిల్లగాండ్లకు పొద్దుగాల ఏదన్న చేద్దామంటే ఇబ్బందయ్యేది. ఇప్పుడు పొద్దుగాల టిఫిన్, పగటేళకు అన్నం అక్కడే పెడుతరు. మాలాంటి పేదోళ్ల ఇండ్లళ్ల పొద్దుగాల టిఫిన్లంటే కొద్దిగా కష్టమే.
-మోర్తాడి గోదావరి, సూర్జపూర్, నిర్మల్
ఇడ్లీ సాంబార్ సూపర్గా ఉంది
సీఎం అల్పాహారం కార్యక్రమంలో భాగంగా ఉదయం మా స్కూల్లో వడ్డించిన ఇడ్లీ సాంబార్, చట్నీ చాలా బాగుంది. మా ఇంట్లో అమ్మ చేసిన టిఫిన్లాగే రుచి అద్భుతంగా ఉంది. మా స్కూల్లో ప్రతి రోజూ ఇలానే రోజుకో రకంగా టిఫిన్స్ పెడతామని టీచర్లు చెప్తున్నరు. మా స్కూల్కు ఇంటి నుంచి నడుచుకుంట రావడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. నేను ఉదయం లేచి తయారయ్యేసరికే స్కూల్ టైం అయ్యేది. అంత ఉదయం ఇంటి దగ్గర తినడం నా వళ్ల కాకపోయేది. ఇప్పుడు కేసీఆర్ సార్ తీసుకు వచ్చిన సీఎం బ్రేక్ఫాస్ట్తో మా ఆకలి తీరుతున్నది.
– మిరిదొడ్డి తేజశ్రీ, 8వ తరగతి, నెహ్రూనగర్, సిరిసిల్ల
కేసీఆర్ సార్కి చేతులెత్తి మొక్కాలె
సర్కారు బళ్లనే ఇక నుంచి పిల్లలకు టిఫిన్ పెడుతరంట. నాకు ఒక్కడే కొడుకు. రోజూ స్కూలుకు పోతడు. ఇప్పుడు ఆరో తరగతి సదువుతున్నడు. పొద్దుగాల ఏం తినకుండా స్కూల్కి పోతే ఆకలితో ఎట్ల ఉంటడనే రంది ఉండే. ఇప్పుడు పొద్దుగాల కూడా స్కూళ్లనే టిఫిన్ పెడుతరంట. మధ్యాహ్నం అన్నం కూడా ఆడనే పెడుతున్నరు. మాలోంటి పేదోళ్ల కోసం సర్కారు మంచి నిర్ణయం తీసుకున్నది. ఇప్పడి సంది అందరి పిల్లలు కూడా ఇగ సర్కారు బడికే పంపుతరు. సీఎం కేసీఆర్ సారు మంచి నిర్ణయం తీసుకున్నరు. ఆయనకు చేతులెక్కి మొక్కాలె.
-తిమ్మక్క, దేగాం, భైంసా, నిర్మల్ జిల్లా
కేసీఆర్ సాబ్కు షుక్రియా
సుబాహ్ స్కూల్మే టిఫిన్ సిస్టం బహుత్ అచ్చాహై. యే సిస్టం హేలాన్ కరేసో సీఎంకో బహుత్ షుక్రియా. బ్రేక్ఫాస్ట్ పథకం తెచ్చిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. ఉదయం ఇంటినుంచి ఏం తినకుండానే పాఠశాలకు వస్తుంటిమి. ఇలాంటి సమయాల్లో ఆకలితో పాఠాలు సమజ్ కాకపోయేటివి. రెండు రోజుల నుంచి ఇక్కడే టిఫిన్ పెడుతుండ్రు. మంచి టేస్ట్తోని చేస్తున్న టిఫిన్ బాగుంది.
– ఒమేరాబేగం, విద్యార్థిని, గాంధీనగర్, బోధన్
విద్యార్థుల అటెండెన్స్ పెరుగుతుంది
సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం చాలా బాగుంది. బోధన్ నియోజకవర్గంలో తొలుత మా పాఠశాలలోనే దీన్ని ప్రారంభించారు. రెండు రోజులుగా విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల్లో కనీసం 40 శాతం మంది విద్యార్థులు ఇంట్లో ఎలాంటి ఆహారం తీసుకోకుండానే బడికి వస్తారు. ఇలాంటి వారికి బ్రేక్ఫాస్ట్ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు ఆకలితో అలమటించే విద్యార్థులు చదువుపై సరిగా దృష్టి సారించకలేకపోతున్నారు. ఇక నుంచి ఆ సమస్య ఉండదు. పైగా విద్యార్థుల అటెండెన్స్ కూడా పెరుగుతుంది.
– మహమ్మద్ అబ్దుల్ వాహెద్, హెచ్ఎం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గాంధీనగర్, బోధన్
కేసీఆర్ ఒక్కరే అన్ని సౌలతులు మంచిగ చేస్తున్నరు
నా పిల్లలను చిన్నప్పటి సంది సర్కారు బళ్లనే చదివిపిస్తున్న. సర్కారు బళ్లో అన్నీ ఫ్రీగా ఇస్తున్నరు. పుస్తకాలు, స్కూల్ డ్రెస్సు, బువ్వ అన్ని మంచిగ ఇస్తున్నరు. ఇప్పుడు పొద్దుగాల టిఫిన్ పెడుతమని అంటున్నరు. ఇంతకన్న మంచిగ ఎవలు అరుసుకుంటరు. ఏ ప్రభుత్వం కూడా గిట్ల పేదోళ్ల గురించి ఆలోచించలె. సీఎం కేసీఆర్ ఒక్కరే అన్ని సౌలతులు మంచిగ చేస్తున్నరు. పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా మంచిగ పెడుతున్నరని పిల్లలు చెబుతున్నరు. వారానికి మూడు గుడ్లు, రాగి జావ.. ఇలా పౌష్టికాహారం ఇస్తున్నరు. ఇప్పుడు పొద్దుగాల టిఫిన్ కూడా పెడుతమని అంటున్నరు. చాలా సంతోషమనిపించింది.
-శనిగారపు నాగలక్ష్మి, సూర్జపూర్, నిర్మల్