హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సొసైటీ జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లకు సెక్రటరీ శారద ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీకి సంబంధించి హెడ్ ఆఫీస్తోపాటు అన్ని కార్యాలయాల అకౌంట్లు, లెక్కల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఎన్జీ రావు అండ్ అసోసియేట్స్ చార్టెడ్ అకౌంటెంట్ను నియమించినట్టు వెల్లడించారు. త్వరలోనే ఆడిట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు తమ పరిధిలో జాప్యం లేకుండా ఆడిట్ను పూర్తిచేయాలని ఆదేశించారు.
‘సొసైటీలో ఇన్చార్జుల పాలనతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అడ్మినిస్ట్రేషన్ విభాగంలోనే కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ఇన్చార్జ్జులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. పీఎంశ్రీ నిధులు.. బోగస్ బిల్లులు’ తదితర అంశాలను తెలుతూ ‘అటకెక్కిన ప్రమోషన్లు.. నిధుల గోల్మాల్’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో గురుకుల సొసైటీ ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రమోషన్లకు సంబంధించి సొసైటీలో ఓ అధికారి పెడుతున్న కొర్రీలపై ఉన్నతాధికారులు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగినట్టు తెలిసింది.
వాస్తవంగా సొసైటీలో అడిషనల్ సెక్రటరీ1, జాయింట్ సెక్రటరీ1, డిప్యూటీ సెక్రటరీ3, ఫైనాన్స్ సెక్రటరీ1, దాదాపు 150 ప్రిన్సిపాల్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రమోషన్లతో భర్తీ చేయాల్సి ఉన్నా సొసైటీ ఉన్నతాధికారులు డిప్యుటేషన్లపై పలువురికి అడ్డదారిలో కీలక స్థానాలు అప్పగించారు. వీటిపై ‘నమస్తే’ కథనాల నేపథ్యంలో తుదకు ఇటీవల ముగ్గురు జోనల్ ఆఫీసర్లకు డిప్యూటీ సెక్రటరీగా ప్రమోషన్లు కల్పించినా మళ్లీ మెలికపెట్టారు. జోనల్ ఆఫీసర్ల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయ్యాక కానీ బాధ్యతలు చేపట్టకుండా ఉండేలా షరతులు పెడుతూ సొసైటీలో చక్రం తిప్పుతున్న సదరు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎక్కడి ప్రమోషన్లు అక్కడే అన్నచందంగా పరిస్థితి తయారైంది.
ఈ అంశంపైనా ‘నమస్తే తెలంగాణ’ ఇటీవల కథనం ప్రచురించింది. విషయం దృష్టికి వెళ్లిన ఉన్నతాధికారులు సదరు ఆదేశాలు, అధికారిపై నిప్పులు చెరిగినట్టు తెలిసింది. తక్షణమే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రమోషన్లు పొందిన జోనల్ ఆఫీసర్లను తక్షణమే డిప్యూటీ సెక్రటరీలుగా బాధ్యతలు స్వీకరించాలని సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.