హైదరాబాద్ : అక్టోబరు నెల నాటికి తెలంగాణలో ఐటీ ఉద్యోగులకు సంపూర్ణ వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. వివిధ సంఘాల భాగస్వామ్యం ద్వారా ఐటీ పరిశ్రమ తన ఉద్యోగులు, వారి కుటుంబాలకు టీకా డ్రైవ్లు నిర్వహిస్తోంది. గత పది రోజుల్లో నిర్వహించిన టీకా డ్రైవ్లో లక్ష మందికి పైగా ఐటీ ఉద్యోగులు వారి కుటుంబాలకు టీకాలు వేశారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమలో 6.5 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. ప్రస్తుతం వీరిలో 10 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు వస్తూ పనిచేస్తున్నారు. మిగతా 90 శాతం మంది ఇంటి నుండే పనిచేస్తున్నారు. గత పదిరోజుల్లో చేపట్టిన వివిధ టీకా డ్రైవ్ల ద్వారా లక్ష మందికి పైగా ఐటీ ఉద్యోగులకు టీకాలు వేసినట్లు ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల తెలిపారు.
హైసియా అధ్యక్షుడు భరణి కుమార్ అరోల్ మాట్లాడుతూ.. ఐటీ ఉద్యోగుల కోసం టీకా కార్యక్రమాలు ఫుల్ స్పీడ్లో కొనసాగుతున్నాయన్నారు. అక్టోబర్ లేదా నవంబర్ నాటికి ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు రెండు డోసులను పూర్తిచేసుకోనున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ 5 వేల నుండి 10 వేల మంది ఐటీ ఉద్యోగులు ఈ టీకా డ్రైవ్లలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఐటీ రంగంలో పనిచేసే మెజారిటీ ఉద్యోగులు 45 ఏళ్లలోపు వారే ఉన్నారన్నారు. దీంతో కేంద్రం ప్రకటించిన ఉచిత టీకా కార్యక్రమం వారికి సహాయపడుతుందని అరోల్ అభిప్రాయపడ్డారు.