హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో మరోసారి ఐటీ, ఈడీ సోదాలతో కలకలం రేగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్నుశాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది. హైదరాబాద్లో పాతబస్తీకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ గ్రూపు స్థిరాస్తి సంస్థతో పాటు మరో ఏడు రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఏకకాలంలో మొదలైన సోదాల్లో వంద ఐటీ బృందాలు పాల్గొన్నట్టు ఆదాయపన్నుశాఖ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా కేంద్ర బలగాల బందోబస్తు మధ్య దాడులు కొనసాగాయి. పాత బస్తీలోని స్థిరాస్తి సంస్థతో అనుబంధం కలిగిన మరో ఏడు రియల్ఎస్టేట్ సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఫలక్నూమా ప్రాంతంలోని ఇండ్లతోపాటు పాతబస్తీ, బండ్లగూడ, మొయిన్బాగ్ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఈ సోదాల్లో తెలంగాణ, ఒడిశాకు చెందిన ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సోదాల్లో ఆయా సంస్థలు చెల్లిస్తున్న పన్నులకు, ఆ వ్యాపారాలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తున్నది.
దీంతో కేసులు నమోదు చేశారు. పలు సంస్థల నుంచి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో పాల్గొనే అధికారులకు కూడా వివరాలు తెలియకుండా సీల్డ్ కవర్లు అందచేసి..వాటిని నిర్దేశించిన చిరునామాకు వెళ్లిన తర్వాత ..ఓపెన్ చేసేలా ఐటీ సోదాల విభాగం అదనపు సంచాలకులు చర్యలు తీసుకున్నట్టు సమాచారం. మాదన్నపేట, శాస్త్రిపురం, బంజారాహిల్స్, శంషాబాద్, అత్తాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు.